కృష్ణా హారతులు పునఃప్రారంభం
ABN , First Publish Date - 2021-10-21T06:54:06+05:30 IST
కృష్ణా హారతులు పునఃప్రారంభం
విజయవాడ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి కొండ దిగువన దుర్గాఘాట్ వద్ద కృష్ణా నదీమతల్లికి ఇచ్చే పవిత్ర హారతులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా నిలిపివేసిన ఈ హారతుల కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దుర్గగుడి ఈవో డి.భ్రమరాంబ, స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మలు దుర్గాఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన హారతులను వీక్షించారు. ఇక మీదట రోజూ 6.30 గంటలకు కృష్ణానదికి పవిత్ర హారతులు కొనసాగుతాయని స్థానాచార్య శివప్రసాద్శర్మ తెలిపారు.
గన్నీ వార్
గన్నీ బ్యాగులు మావే.. ఇవ్వాల్సిందే : ప్రభుత్వం
ఆదాయం కోల్పోతాం.. ఇవ్వలేం : కొందరు డీలర్లు
ఫ షోకాజ్ నోటీసులు జారీ ఫ మంత్రి హామీ బుట్టదాఖలు
(ఆంరఽధజ్యోతి, విజయవాడ) : చౌక దుకాణ డీలర్లకు ఉచితంగా ఇచ్చే గన్నీలను వెనక్కి తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న డీలర్లపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లాలో గన్నీ సంచులను ఇవ్వటానికి ఇష్టపడని పలువురు డీలర్లకు అధికార యంత్రాంగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా ఈ సంచులు డీలర్ల హక్కులుగా వస్తున్నాయి. వీటిని అమ్ముకోవటం ద్వారా డీలర్లకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ-పోస్ వ్యవస్థ వచ్చాక డీలర్లు అక్రమాలు చేయటానికి దాదాపు అవకాశం లేకుండాపోయింది. ఇలాంటపుడు కమీషన్తో డీలర్లు మనుగడ సాధించటం కష్టం. ఈ గన్నీలను అమ్ముకోవటం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వాలెప్పుడూ గన్నీ బ్యాగులను డీలర్ల నుంచి బలవంతంగా తీసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం ఎండీయూల నిర్వహణ వ్యవస్థ భారంగా మారటంతో ఆ ఖర్చును కొంతవరకైనా తగ్గించేందుకు డీలర్ల గన్నీలపై కన్నేసింది. గన్నీలను తమకు తిరిగి ఇవ్వాలని అధికారులు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మాట వినని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు.
గన్నీలు లేకపోతే రేషన్ షాపుల మూసివేతే..
జిల్లాలో మొత్తం 2,300 పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో 90 శాతం షాపులకు 50 నుంచి 70 క్వింటాల్ కోటా మాత్రమే ఉంటుంది. కిలోకు రూపాయి చొప్పున కమీషన్ లెక్కిస్తే సగటున డీలరుకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు వస్తుంది. గన్నీ సంచుల విక్రయం ద్వారా అదనంగా రూ.1,000 నుంచి రూ.1,400 వరకు వస్తుంది. సగటున రూ.6 వేల నుంచి రూ.7,400 వరకు ఆదాయం వస్తుంది. నగరంలో కార్డులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, రూ.8వేల వరకు ఆదాయం ఉంటుంది. ఈ ఆదాయంలో క్వింటాకు రూ.10 చొప్పున దిగుమతి చార్జీలు, దుకాణం అద్దె రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటుంది. ఈ ఖర్చులు పోనూ రూరల్లో రేషన్ డీలరుకు రూ.3 వేల నుంచి రూ.4 వేలు, నగరంలో రూ.4 వేలు నుంచి రూ.5 వేలు మించి రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో గన్నీలు పోతే రేషన్ దుకాణానికి రాజీనామా చేయాల్సిందేనని డీలర్లు వాపోతున్నారు.
కరోనా ఎఫెక్ట్
కరోనా ఎఫెక్ట్తో బెంగాల్ నుంచి గన్నీలు రావడం లేదన్న కారణంతో పాత గన్నీలు ఇస్తే రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో గన్నీకి రూ.16 ఇస్తామని అప్పటి ఎండీ సూర్యకుమారి ఉత్తర్వులు ఇచ్చారు. ధర పెంచమని డీలర్ సంఘం అధ్యక్షుడు మండాది వెంకట్రావు కోరగా, ఒక్కో గన్నీకి రూ.20 ఇస్తామన్నారు. ఈ మేరకు రెండు నెలల డబ్బులు కూడా ఇచ్చారు. తాజాగా ఆగస్టు నుంచి డీలర్లకు గన్నీలకు డబ్బు ఇవ్వడం మానేశారు. అదేమిటని డీలర్ల సంఘాలు అడిగితే, ఎండీయూ వ్యవస్థను అమల్లోకి తెచ్చే ముందు విడుదల చేసిన జీవోను సాకుగా చూపిస్తున్నారు. ఏమిటా జీవో..?
రేషన్ డోర్ డెలివరీ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే క్రమంలో కిందటిఏడాది ఆగస్టులో మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు పౌరసరఫరాల శాఖ ఓ జీవో జారీ చేసింది. దీనిలో రేషన్ డీలర్ల నుంచి గన్నీలను వెనక్కు తీసుకుని వేలం వేయడం ద్వారా డోర్ డెలివరీకి చేసే ఖర్చులో కొంతమేర పూడ్చుకోవచ్చని క్లాజ్ పెట్టారు. అప్పట్లో ఈ క్లాజ్పై రాష్ట్రవ్యాప్తంగా డీలర్ల సంఘాలు ఆందోళన చేశాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో దీనిపై స్పందించారు. జీవో ఎలా ఇచ్చారో తనకు తెలియదని అధికారులతో, అవసరమైతే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తామని సభాముఖంగా హామీ కూడా ఇచ్చారు. మరి తాజా అంశంపై మంత్రి కొడాలి నాని ఎలా స్పందిస్తారో చూడాలి.