కేఆర్ మార్కెట్ ప్రారంభం
ABN , First Publish Date - 2020-05-25T09:29:11+05:30 IST
లాక్డౌన్ నిబంధనల మేరకు మూసివేసిన పాతబస్తీలోని కాళేశ్వరరావు మార్కెట్ ఎంపీ కేశినేని నాని జోక్యంతో
వన్టౌన్, మే 24 : లాక్డౌన్ నిబంధనల మేరకు మూసివేసిన పాతబస్తీలోని కాళేశ్వరరావు మార్కెట్ ఎంపీ కేశినేని నాని జోక్యంతో సోమవారం పునఃప్రారంభం కానుంది. మార్కెట్ సంఘం అధ్యక్షుడు ఆలమూరి కొండ, కార్యదర్శి మైలవరపు కృష్ణ ఆదివారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వారు మాట్లాడుతూ మార్కెట్ను ఎలా ప్రారంభిస్తారని వన్టౌన్ పోలీస్ స్టేషన్లోని ఓ అధికారి స్థానిక పారిశుధ్య అధికారితో కలిసి మార్కెట్ సంఘం నాయకులపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కరోనా కారణంగా వెస్ట్ ఏసీపీ కె.సుధాకర్ సూచనల మేరకు మార్కెట్ను మూసివేశామని, 15 రోజుల తరువాత మళ్లీ మార్కెట్ను తెరవటానికి ఏసీపీని సంప్రదించగా, మున్సిపల్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని తెలిపారని, కమిషనర్ సూచన మేరకు కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. నెల రోజులైనా మార్కెట్ను తెరిచేందుకు అనుమతి రాకపోవడంతో ఎంపీ కేశినేని నానిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నామన్నారు. ఆయన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి మార్కెట్ ప్రారంభించడానికి సహకరించాలని కోరగా, అనుమతి లభించిందన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి వ్యాపారాలు చేస్తామని చెప్పారు. మార్కెట్ను పునఃప్రారంభించడానికి కృషి చేసిన ఎంపీకి వారు కృతజ్ఞతలు తెలిపారు.