మోదీకి నేపాల్ ప్రధాని ఓలీ ఫోన్, కోవిడ్-19పై చర్చ
ABN , First Publish Date - 2020-08-15T20:28:42+05:30 IST
నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.
న్యూఢిల్లీ : నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. భారత దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని వేధిస్తున్న కోవిడ్-19 పరిస్థితిపై చర్చించారు.
అంతకుముందు ఓలీ ఇచ్చిన ట్వీట్లో, ‘‘సంతోషకరమైన 74వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రభుత్వం, భారత ప్రజలకు అభినందనలు, శుభాకాంక్షలు. భారతీయులు మరింత ప్రగతి, సౌభాగ్యం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
నేపాల్, భారత్ మధ్య ఇటీవల ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి. భారత దేశంలోని కాలాపానీ, లిపులేఖ్, లింపియధుర భూభాగాలను తమవిగా చెప్పుకుంటూ నేపాల్ కొత్తగా ఓ మ్యాప్ను ఆమోదించడంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.