దమ్ముంటే కొడాలి నాని రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2020-08-03T09:35:48+05:30 IST
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని ముందుగా రాజీనామా చేసి ..
మచిలీపట్నం టౌన్, ఆగస్టు 2: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని ముందుగా రాజీనామా చేసి గుడివాడ నియోజక వర్గంలో అమరావతి రాజధానిపై రిఫరెండం పెట్టి ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయాలని ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో బచ్చుల అర్జునుడు మాట్లాడారు. అనుభవజ్ఞుడైన మాజీ సీఎం చంద్రబాబు వద్ద టీడీపీలో పనిచేసిన కొడాలి నాని జగన్ మెప్పు కోసం చంద్రబాబును విమర్శిస్తున్నారన్నారు.
అమరావతే.. ప్రజల ఆకాంక్ష
రాష్ట్రంలో చాలా జిల్లాల ప్రజలు అమరావతి రాజధానిని కోరుకుంటున్నారని తెలిపారు. సామాజిక పింఛను రూ. 200 నుంచి రూ. 1000, రూ. 1000 నుంచి రూ. 2 వేల వరకు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 3వేల పింఛను ఇస్తానని ఓట్లు వేయించుకున్న జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదైనా రూ. 250 మాత్రమే పెంచారన్నారు. 45 ఏళ్లకేఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు వృద్ధాప్య పింఛను ఇస్తానని జగన్మోహనరెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చిన రూ. 2వేల పింఛను బ్యాంకు అకౌంట్లలో పడేవని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం వలంటీర్లతో ఇప్పిస్తూ కొత్తగా ఇప్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.
కరోనా సాయం అందించలేదు
కేంద్ర ప్రభుత్వం కరోనా సాయం కింద ఇచ్చిన రూ. 1000ని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించలేదన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి వైసీపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. సమావేశంలో మునిసిపల్ మాజీ వైస్చైర్మన్ పంచపర్వాల కాశీవిశ్వనాథం, టీడీపీ జిల్లా కార్యదర్శి పి.వి. ఫణికుమార్, మాజీ కౌన్సిలర్ కొట్టె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.