ఎందుకింత వ్యత్యాసం?

ABN , First Publish Date - 2020-10-01T08:43:22+05:30 IST

పప్పుశనగ క్వింటానికి రూ.6,200 చొప్పున ఆర్గనైజర్లకు ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుందని, తమకు కూడా ఇదే ధర చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

ఎందుకింత వ్యత్యాసం?

ఆర్గనైజర్లకు రూ.6,200.. మాకిచ్చేది రూ.4,900

ఏపీ సీడ్స్‌ అధికారులతో పప్పుశనగ రైతులు

ఆంధ్రజ్యోతి కథనంతో అధికారుల్లో కదలిక

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


కర్నూలు(అగ్రికల్చర్‌), సెప్టెంబరు 30: పప్పుశనగ క్వింటానికి రూ.6,200 చొప్పున ఆర్గనైజర్లకు ఇచ్చేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుందని, తమకు కూడా ఇదే ధర చెల్లించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. కష్టాల్లో ఉన్న తమకు క్వింటానికి రూ.4,900 మాత్రమే ఇస్తే తీవ్రంగా నష్టపోతామని, ప్రైవేటు ఏజెన్సీలకు చెల్లిస్తున్న ధరే ఇవ్వాలని కోరారు. రబీలో రైతులకు రాయితీపై ఇచ్చేందుకు ఏపీ సీడ్స్‌ సంస్థ సేకరించనున్న శనగలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వారం రోజులుగా ప్రచురించిన వార్తలకు ఏపీ సీడ్స్‌ రాష్ట్ర అధికారులు స్పందించారు.


మంగళవారం ఈ అంశంపై ‘దోపిడీకి సిద్ధం’ అన్న శీర్షికన ప్రధాన కథనం కూడా ప్రచురితమైంది. దీంతో ఏపీ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బి.శేఖర్‌బాబు ఆదేశాల మేరకు అమరావతి నుంచి జనరల్‌ మేనేజర్‌ లత బుధవారం కర్నూలులోని కార్యాలయానికి వచ్చారు. రైతులతో చర్చించారు. రైతు సంఘం ప్రతినిధిగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి కుమారుడు నరసింహారెడ్డితో పాటు రైతు సంఘం ప్రతినిధులు గోపాల్‌ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను విన్నవించారు.


రైతులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని జనరల్‌ మేనేజర్‌ లత, జిల్లా మేనేజర్‌ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రైవేటు ఏజెన్సీలతో సమానంగా శనగలకు తప్పనిసరిగా ధరను అందిస్తామని, దీనిపై మేనేజింగ్‌ డైరెక్టర్‌ సానుకూలంగా ఉన్నారని అన్నారు. అనంతరం జనరల్‌ మేనేజర్‌ విలేకరులతో మాట్లాడుతూ విత్తన సేకరణలో ప్రైవేటు ఏజెన్సీలతో సమానంగా రైతులకు గిట్టుబాటు ధరను అందించేందుకు మేనేజింగ్‌ డైరెక్టర్‌కు నివేదికను అందజేస్తామన్నారు. అనంతరం వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మతో చర్చించారు. 

Updated Date - 2020-10-01T08:43:22+05:30 IST