‘చార్లీ హెబ్డో’ పాత కార్యాలయం వద్ద దాడి... నలుగురికి గాయాలు...
ABN , First Publish Date - 2020-09-25T22:21:29+05:30 IST
హాస్య పత్రిక ‘చార్లీ హెబ్డో’ పాత కార్యాలయం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
పారిస్ : హాస్య పత్రిక ‘చార్లీ హెబ్డో’ పాత కార్యాలయం వద్ద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఫ్రెంచ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సెటైరికల్ న్యూస్ పేపర్ చార్లీ హెబ్డో పాత కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు కత్తి పోట్లకు గురికాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు.
రిచర్డ్ లెనోయిర్ సబ్వే స్టేషన్ సమీపంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు భారీగా వచ్చి, చుట్టుముట్టారు.
‘చార్లీ హెబ్డో’ కార్యాలయంపై 2015 జనవరిలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.