వ్యాక్సిన్ వేయండి
ABN , First Publish Date - 2021-05-09T05:51:58+05:30 IST
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), మే 8: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్, ఆక్సిజన్ లేక ప్రజలు మృత్యువాత పడుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం దారుణమని, తక్షణమే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
ప్రజల ప్రాణాలు కాపాడండి
సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి
డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), మే 8: రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్, ఆక్సిజన్ లేక ప్రజలు మృత్యువాత పడుతున్నా పాలకులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం దారుణమని, తక్షణమే ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు డిమాండ్ చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శనివారం తన గృహంలో వనమాడి ‘వ్యాక్సిన్ వేయండి- ప్రజల ప్రాణాలు కాపాడండి’ అనే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వం తీరుపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తీవ్రతను గుర్తించిన మహారాష్ట్ర ప్రభుత్వం కోటి వ్యాక్సిన్ల కొనుగోలుకు సింగిల్ పేమెంట్ విధానంలో ఒప్పందం చేసుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడి నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ వేయడం ప్రభుత్వ కనీస బాధ్యత అని చెప్పారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని డాక్టర్లు, ఫార్మా రంగంలో నిపుణులతో చంద్రబాబు సమీక్షలు చేసి ప్రభుత్వానికి సూచనలు చేస్తుంటే ఆయనను దూషించడమే పనిగా వైసీపీ నాయకులు వ్యవహరించడం దారుణమన్నారు. అక్రమ తవ్వకాలు, భూకబ్జాలు, దోపిడీలు, దౌర్జన్యాలు పక్కనపెట్టి ఆక్సిజన్ సరఫరాపై దృష్టి సారించాలని కొండబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.