మామిడి అమ్మకానికి కిసాన్ రైలు ఏర్పాటు
ABN , First Publish Date - 2021-05-29T04:50:46+05:30 IST
మామిడి రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా త్వరలో ఢిల్లీ వరకు కిసాన్ రైలు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు మామిడి తరలించి విక్రయించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ అన్నారు.
ఉద్యానశాఖ కమిషనర్ శ్రీధర్
చిత్తూరు కలెక్టరేట్, మే 28: మామిడి రైతులకు గిట్టుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందులో భాగంగా త్వరలో ఢిల్లీ వరకు కిసాన్ రైలు ఏర్పాటు చేసి జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు మామిడి తరలించి విక్రయించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఉద్యానశాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో మామిడి రైతులు, గుజ్జు పరిశ్రమ యజమానులు, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా మామిడి పంట కోతకు వస్తుందన్నారు. తూర్పు మండలాల్లో మరో మూడు నాలుగు రోజుల్లో కోతలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. గుజ్జు పరిశ్రమలు తమ ఉత్పత్తుల తయారీని ప్రారంభించాయని చెప్పారు. టమోటా పంటకు గిట్టుబాటు ధర లేదని, మహిళా సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయించి గుజ్జు పరిశ్రమలకు పంపిస్తున్నట్లు చెప్పారు. అదే పద్ధతితో మామిడి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కొవిడ్ నేపథ్యంలో ఇతర రాష్ర్టాల వ్యాపారుస్తులు జిల్లాకు రాకపోవడంతో మామిడి ధరలు భారీగా పతనమయ్యాయని చెప్పారు. గుజ్జు పరిశ్రమల యజమానులు రైతులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ అధికారి కోటేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ జేడీ సుధాకర్, ఏడీ ఇందుమతి, రైతు నాయకులు జీవీ జయచంద్ర చౌదరి, మాంగాటి గోపాల్, వెంకటరెడ్డి, నాగేశ్వరరాజు, తదితరులు పాల్గొన్నారు.