సైనిక సామర్థ్యం మరింత పెంచుతా : కిమ్ జోంగ్ ఉన్

ABN , First Publish Date - 2022-01-01T18:23:15+05:30 IST

ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచడంతోపాటు

సైనిక సామర్థ్యం మరింత పెంచుతా : కిమ్ జోంగ్ ఉన్

సియోల్ : ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచడంతోపాటు కోవిడ్-19 నిరోధక చర్యలను కొనసాగిస్తామని ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం శ్రమిస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన  ఓ రాజకీయ సమావేశంలో ఆయన మాట్లాడినట్లు ఆ దేశ ప్రభుత్వ  మీడియా శనివారం వెల్లడించింది. 


కొరియన్ ద్వీపకల్పంలో సైనిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, అంతర్జాతీయ రాజకీయాలు కూడా అదేవిధంగా ఉన్నాయని, అందువల్ల ఉత్తర కొరియా దేశ భద్రత కోసం ప్రణాళికలను పటిష్టపరచుకోవడం తప్పనిసరి అయిందని కిమ్ చెప్పినట్లు తెలిపింది. అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చల గురించి ఆయన ప్రస్తావించలేదని తెలిపింది.


అత్యంత శక్తిమంతమైన ఆధునిక ఆయుధ వ్యవస్థలను ఉత్పత్తి చేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలిపింది. తన నేతృత్వంలోని అధికార పార్టీకి సైన్యం పరిపూర్ణ విధేయత వ్యక్తం చేయాలని చెప్పినట్లు పేర్కొంది. 


ఈ నేపథ్యంలో నిపుణులు స్పందిస్తూ, కిమ్ జోంగ్ ఉన్‌కు అమెరికా, దక్షిణ కొరియాలతో చర్చలు జరపాలనే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. ఉత్తర కొరియా సరిహద్దులను మూసేసే పరిస్థితి కనిపిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి సంబంధిత ఇబ్బందులను అధిగమించడం కోసం స్వయంసమృద్ధ ఆర్థిక వ్యవస్థ కోసం పిలుపునిస్తున్నారని చెప్పారు. 


కిమ్ పదేళ్ళ నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. 2011 డిసెంబరులో ఆయన తండ్రి మరణం తర్వాత ఆయన అధికార పగ్గాలు చేపట్టారు. 


Updated Date - 2022-01-01T18:23:15+05:30 IST