మేఘాలయ ‘కుట్ర’పై కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది : ఖర్గే

ABN , First Publish Date - 2021-11-26T00:26:55+05:30 IST

మేఘాలయలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలిపెట్టడం

మేఘాలయ ‘కుట్ర’పై కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తోంది : ఖర్గే

న్యూఢిల్లీ : మేఘాలయలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలిపెట్టడం పెద్ద కుట్ర అని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ కుట్రపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు ఓ నిర్ణయం తీసుకుంటారని ఓ వార్తా సంస్థకు చెప్పారు. 


మేఘాలయలో కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వీరిలో 12 మంది బుధవారం రాత్రి ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ మెట్బా లింగ్డోకు ఓ లేఖ సమర్పించారు. తాము కాంగ్రెస్ నుంచి టీఎంసీలో చేరినట్లు తెలిపారు. పార్టీ మారినవారిలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉన్నారు. 


ఈ నేపథ్యంలో ఖర్గే గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఇదంతా ఓ కుట్ర మాదిరిగా జరుగుతోందన్నారు. తమ పార్టీ నేతలు, ముఖ్యంగా అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితర అధిష్ఠానం పెద్దలు దీనిపై పరిశీలన జరుపుతున్నారన్నారు. వారంతా ఓ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతున్నప్పటికీ పార్లమెంటులో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోరాడతాయని చెప్పారు. 


పోరాటాలు జరుగుతూనే ఉంటాయని, ఇప్పుడు వ్యాఖ్యానించడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పార్లమెంటు వేదికగా కలిసికట్టుగా పోరాడటమే ముఖ్యమని తెలిపారు. పార్టీలకు వేర్వేరు భావజాలాలు ఉండవచ్చునని, అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటమే ఉమ్మడి లక్ష్యమని ఫ్లోర్ లీడర్ల సమావేశంలో రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. పార్లమెంటులో బీజేపీని ఓడించడానికి ఏకతాటిపైకి రావడానికి తాము ప్రయత్నిస్తామన్నారు. ‘‘మా భావజాలం, పార్టీ ఏది అయినప్పటికీ, బీజేపీ భావజాలాన్ని, బీజేపీని పార్లమెంటులో ఓడించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. 


Updated Date - 2021-11-26T00:26:55+05:30 IST