ఓటుతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2021-04-11T06:39:25+05:30 IST

ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సాగర్‌ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా మద్యం, మనీ పంపిణీ చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు మీఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు.

ఓటుతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి
మండల కేంద్రంలో మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి, పక్కన అభ్యర్థి జానారెడ్డి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి 

తిరుమలగిరి (సాగర్‌), ఏప్రిల్‌ 10: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సాగర్‌ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యానికి విరుద్దంగా మద్యం, మనీ పంపిణీ చేయాలని చూస్తున్న కేసీఆర్‌కు మీఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం ఆయన తిరుమలగిరి, డొక్కలబావితండా, నాయకునితండా, చింతలపాలెం తదితర గ్రామాల్లో జానారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలకు మోసమే మిగిలిందన్నారు. రూ.3.30లక్షల కోట్ల అప్పుచేసి కేసీఆర్‌ తన ఖజానాను నింపుకున్నారని ఆరోపించారు. లక్షా 91 వేల ఉద్యోగాలు ఉంటే నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేయడంతో, వారు నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా అభ్యర్థి కుందూరు జానారెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, మూడు ఎకరాల భూపంపిణీ రావాలంటే ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. తన హయాంలోనే నియోజకవర్గంలోని ప్రతితండా, గ్రామాలకు రోడ్లు, కరెంట్‌, తాగు, సాగునీరు అందించామన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ మాట్లాడుతూ సోనియాగాంధీ ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా తెలంగాణకోసం ఆ పదవిని త్యజించిన గొప్పనేత జానారెడ్డి అని కొనియాడారు. ప్రచారంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌, కుందూరు జయవీర్‌రెడ్డి, శాగం పెద్దిరెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2021-04-11T06:39:25+05:30 IST