ఆక్రమిత భూములు పరిశీలించిన ఆర్డీవో

ABN , First Publish Date - 2022-07-06T03:32:34+05:30 IST

మండలంలోని ఐతంపాడు గ్రామంలో 1, 4, 6, 7 సర్వే నెంబర్లలో ఆక్రమణకు గురైన 200 ఎకరాల అనాధీన భూములను కావలి ఆర్డీవో శీనానాయక్‌ మంగళవారం పరిశీలించారు.

ఆక్రమిత భూములు పరిశీలించిన ఆర్డీవో
ఆక్రమణదారులతో మాట్లాడుతున్న ఆర్డీవో శీనానాయక్‌

దగదర్తి, జూలై 5: మండలంలోని ఐతంపాడు గ్రామంలో 1, 4, 6, 7 సర్వే నెంబర్లలో ఆక్రమణకు గురైన 200 ఎకరాల అనాధీన భూములను కావలి ఆర్డీవో శీనానాయక్‌ మంగళవారం పరిశీలించారు. ఈ భూముల్లో 145 సెక్షన్‌ అమలులో ఉన్నప్పటికీ గ్రామానికి చెందిన కొందరు నేతలు వాటిని లెక్కచేయకుండా సాగు చేపట్టారు. అంతేకాకుండా బోర్లు కూడా వేసి, మోటార్లకు విద్యుత్‌ మీటర్లు ఏర్పాటు చేసుకున్నారు. చివరకు అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును కూడా తొలగించారు. ఈ ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు వచ్చినా, ప్రజా సంఘాల నుంచి వినతులు వెళ్లిన అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్‌.మల్లి  స్పందన కార్యక్రమంలో భూముల ఆక్రమణపై వినతిపత్రం ఇవ్వడంతో కావలి ఆర్డీవో శీనానాయక్‌ గ్రామానికి విచ్చేసి ఆక్రమిత భూములనను పరిశీలించారు. భూములను ఆక్రమించిన గ్రామస్థులతో మాట్లాడారు. నిషేధిత భూముల్లో సాగు చేపట్టకూడదని సూచించారు, అర్హులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. కానీ, ఆక్రమిత భూముల్లో ఏర్పాటు చేసిన బోరుబావులు, విద్యుత్‌ మోటార్లను పరిశీలించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆర్డీవో పర్యటన మొక్కుబడిగానే సాగింది. అంతకుముందు మనుబోలపాడు సచివాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి సిబ్బందితో పథకాల అమలుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వో తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T03:32:34+05:30 IST