ఆర్ఎస్ఎస్ వల్లే నేను ఈ స్థాయిలో... సీఎం యడియూరప్ప
ABN , First Publish Date - 2021-03-05T17:23:07+05:30 IST
విపక్షాలపై కర్ణాటక సీఎం యడియూరప్ప గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
బెంగళూరు: విపక్షాలపై కర్ణాటక సీఎం యడియూరప్ప గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు... ఆర్ఎస్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. ఆర్ఎస్ఎస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. వెల్లోకి ప్రవేశించిన కాంగ్రెస్ సభ్యులు .. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ వెనక ఆర్ఎస్ఎస్ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మాట్లాడిన సీఎం యడియూరప్ప.. ‘‘అవును మేము ఆర్ఎస్ఎస్.. ప్రధాని మోదీ కూడా తాను ఆర్ఎస్ఎస్ అని గర్వంగా చెప్పుకుంటారు. ఆర్ఎస్ఎస్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. ఆర్ఎస్ఎస్ను విమర్శించే నైతికత మీకుందా’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ‘మీరు విమర్శించే కొద్దీ.. ఆర్ఎస్ఎస్ మరింత శక్తిమంతం అవుతుంది’ అన్నారు. ఆఖరుకి కోవిడ్పై అసమాన పోరాటం చేస్తూ.. ప్రపంచ నేతల ప్రశంసలు పొందుతున్న మోదీ గడ్డంపైనా విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.