హిజాబ్ ధారణ ఇస్లాంలో ముఖ్యమైన ఆచారం కాదు : కర్ణాటక ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-02-18T22:05:04+05:30 IST

హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల

హిజాబ్ ధారణ ఇస్లాంలో ముఖ్యమైన ఆచారం కాదు : కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు : హిజాబ్ ధారణ ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతాచారాల పరిధిలోకి రాదని కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. అదేవిధంగా హిజాబ్‌ను ధరించే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1) పరిధిలోకి వస్తుందని కూడా భావించడం లేదని చెప్పింది. శబరిమల, షాయరా బానో కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పినట్లుగా హిజాబ్ ఆచారం రాజ్యాంగపరమైన నైతికత, వ్యక్తిగత గౌరవ, మర్యాదల పరీక్షలో గెలవడం తప్పనిసరి అని తెలిపింది. ఈ వివాదంపై వరుసగా ఆరో రోజు విచారణ జరిగింది. 


ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ఓ ప్రశ్న అడిగింది. ప్రశాంతతను దెబ్బతీసే వస్త్రాలను అనుమతించేది లేదని ఫిబ్రవరి 5న ఇచ్చిన ఆదేశాల వెనుక ఉన్న సహేతుకత ఏమిటని అడిగింది. అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ, ఈ ఉడుపిలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో ఈ వివాదం ప్రారంభమైందన్నారు. ఈ కళాశాలలో చాలా కాలం నుంచి యూనిఫాం అమలవుతోందన్నారు. 2021 డిసెంబరు వరకు యూనిఫాం ధరించడంలో విద్యార్థినుల నుంచి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాలేదన్నారు. 


తమకు హిజాబ్ ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు విద్యార్థినులు ఈ కళాశాల ప్రిన్సిపల్‌ను కోరడంతో, ఈ విజ్ఞప్తిని కళాశాల అభివృద్ధి కమిటీ పరిశీలించిందని చెప్పారు. 2022 జనవరి 1న ఈ కమిటీ సమావేశం జరిగినట్లు తెలిపారు. 1985 నుంచి యూనిఫాం అమలవుతోందని, విద్యార్థినులు యూనిఫాంను ధరిస్తున్నారని, దీనిని మార్చకూడదని ఈ కమిటీ నిర్ణయించిందని చెప్పారు. హిజాబ్ ధరించేందుకు అనుమతించాలని కోరిన విద్యార్థినుల తల్లిదండ్రులను కూడా ఈ సమావేశానికి పిలిచారని, 1985 నుంచి యూనిఫాం అమలవుతున్న విషయాన్ని వారికి చెప్పారని తెలిపారు. అయితే విద్యార్థినులు నిరసనలను ప్రారంభించడంతో ఈ సమావేశం వల్ల ఉపయోగం లేకపోయిందని చెప్పారు. ఈ సమస్య సున్నితత్వం గురించి ప్రభుత్వానికి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిందన్నారు. 


Updated Date - 2022-02-18T22:05:04+05:30 IST