కళ్లెదుట కలల వంతెన

ABN , First Publish Date - 2020-10-16T12:09:20+05:30 IST

దశాబ్దం కల సాకారమయింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కలల వంతెన..

కళ్లెదుట కలల వంతెన

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ప్రారంభం నేడు!

దేశంలోనే అతి పొడవైన వంతెన జాతికి అంకితం 

ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ప్రతిరూపం

ఒంటి స్తంభంపై ఆరు వరసలు

గడ్కరీకి స్ఫూర్తినిచ్చిన వంతెన


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దశాబ్దం కల సాకారమయింది. ఐదేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కలల వంతెన కళ్లెదుట నిలిచింది. అవాంతరాలెన్నింటినో అధిగమించి.. ఒంటి స్తంభంపై ఆరు వరసల అద్భుతం ఆరంభానికి సిద్ధమయింది. ‘రెక్కలు’ చాచి, వంపులు తిరిగి వయ్యారంగా సాగిపోయే అత్యంత పొడవైన కనకదుర్గా ఫ్లై ఓవర్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 


స్పైన్‌ అండ్‌ వింగ్స్‌ టెక్నాలజీతో  దేశంలోనే ఢిల్లీ, ముంబయిల తర్వాత మూడవది... పొడవులో దేశంలోనే మొదటి వంతెన.. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీ నుంచి ఉదయం 11.30 గంటలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసు నుంచి సీఎం జగన్‌ వర్చువల్‌గా పాల్గొంటారు. క్షేత్రస్థాయిలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నానిలతో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు ఫ్లై ఓవర్‌ వద్ద వాహనాల రాకపోకలను ప్రారంభిస్తారు. 


నితిన్‌ గడ్కరీకి స్ఫూర్తినిచ్చిన వంతెన

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని శంకుస్థాపన రోజే తెలుసుకున్న  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన నియోజకవర్గంలోనూ ఇలాంటి ఫ్లై ఓవర్‌ను నిర్మించాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఇంత పెద్దది కాకపోయినా.. ఇదే టెక్నాలజీతో ఫ్లై ఓవర్‌కు శ్రీకారం చుట్టారు. దాని పనులు ఇప్పటికి 27 శాతం జరిగాయి. 


ఘనతను చాటేలా వీడియో ప్రదర్శన  

కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఘనతను దేశానికి చాటి  చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీడియోను రూపొందించింది. శుక్రవారం ప్రారంభోత్సవం సందర్భంగా న్యూస్‌ చానళ్లలో దీనిని ప్రసారం చేయనున్నారు. 


బెంజ్‌ ఫ్లై ఓవర్‌-1 ప్రారంభం నేడు

విజయవాడ(ఆంధ్రజ్యోతి): నగరంలో ప్రాధాన్యత కలిగిన మరో ఫ్లైఓవర్‌ బెంజ్‌సర్కిల్‌-1.. దీనిని కూడా కేంద్ర మంత్రి గడ్కరీ శుక్రవారం ప్రారంభించనున్నారు. బెంజ్‌ ఫ్లై ఓవర్‌-1ను రూ.75 కోట్ల వ్యయంతో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ చేపట్టింది. ఎస్వీఎస్‌ జంక్షన్‌ నుంచి నోవాటెల్‌ వరకు 1.14 కిలోమీటర్ల పొడవున్న ఈ మూడు వరసల వంతెనను కేంద్రం తలపెట్టింది. వాస్తవానికి దీనిని కూడా ఆరు వరసలతో నిర్మించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారి మధ్యన ఆరు వరసల ఫ్లై ఓవర్‌ వల్ల నగరం మూసుకుపోతుందని భావించి.. గ్రీన్‌బెల్ట్‌ల పరిధిలో రెండు వైపులా మూడేసి వరసలతో రెండు వంతెనలను డిజైన్‌ చేయించారు. గడ్కరీ ఫ్లైఓవర్‌-1ను ప్రారంభించి, రూ.100 కోట్ల వ్యయంతో చేపట్టిన ఫ్లై ఓవర్‌-2 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు విజయవాడ-మచిలీపట్నం నాలుగు వరసల రహదారిని కూడా ప్రారం భిస్తారు. కాజ-గుండుగొలను రోడ్డు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఆరువరసల విజయవాడ బైపాస్‌ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. 


సమగ్ర స్వరూపం ఇదీ.. 

కనకదుర్గ ఆరు వరసల ఫ్లై ఓవర్‌తో పాటు, దిగువన నాలుగు వరసల రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన ప్రాజెక్టు వ్యయం రూ.447 కోట్లు. ఇందులో కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వ్యయం రూ. 211.31 కోట్లు. 

పొడవు : 2.60 కిలోమీటర్లు 

వ్యయం : రూ. 211.31 కోట్లు 

నిర్మాణ సమయం : 5 ఏళ్లు 

పిల్లర్లు : 47 

వింగ్స్‌ : 1406 

స్పాన్స్‌ : 46 


Updated Date - 2020-10-16T12:09:20+05:30 IST