వెండినంది వాహనంపై ఆదిదంపతులు
ABN , First Publish Date - 2022-05-29T04:31:15+05:30 IST
కరుణామయి జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి వెండినంది వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు.
గిన్నెభిక్ష గ్రామోత్సవంలో మల్లికార్జునస్వామి దర్శనం
బుచ్చిరెడ్డిపాళెం,మే28: కరుణామయి జొన్నవాడ కామాక్షితాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి వెండినంది వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుద్దీపాలు, మంగళమేళాల నడుమ అమ్మవారి వెండినంది సేవ గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక భక్తులు అడుగడుగునా చలువ పందిళ్లు ఏర్పాటుతో అమ్మవార్లను ఆ పందిళ్లలో విడిది చేయించి పలు నివేదనలు సమర్పించి అనంతరం ప్రసాద వితరణ చేశారు. వెండినందిసేవకు నూకలపాటి రంగమ్మ అనుబంధ సంస్థ తరఫున స్పెసిఫిక్ ఎండోమెంట్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆదివారం ఉదయం రథోత్సవం, సాయంత్రం గజసింహవాహనోత్సవాలు జరగనున్నాయి.
గిన్నెభిక్ష గ్రామోత్సవంలో మల్లికార్జునస్వామి
శనివారం ఉదయం శ్రీ మల్లికార్జునస్వామి గిన్నెభిక్ష గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక భక్తులు స్వామికి బియ్యం, డబ్బులు, పండ్లు, టెంకాయలు సమర్పించుకున్నారు. గిన్నెభిక్ష కార్యక్రమానికి నెల్లూరుకు చెందిన దివంగత చిల్లకూరి చంద్రశేఖర్రెడ్డి కుమారుడు న్యాయవాది విక్రమ్ ఉభయకర్తగా వ్యవహరించారు. ఈసందర్భంగా పెన్నానదిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పౌరాణిక నాటికలు భక్తులను అలరించాయి. కార్యక్రమాలను ఆలయ కమిటీ చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు, ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు, సభ్యులు పర్యవేక్షించారు. సీఐ సీహెచ్. కోటేశ్వరరావు, ఎస్ఐ కే. వీరప్రతాప్ ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు.
శనివారం ఉదయం వరకు రావణసేవ
శుక్రవారం అర్దరాత్రి 1 గంట నుంచి ప్రారంభమైన రావణసేవ వాహనోత్సవం శనివారం ఉదయం 9గంటల వరకు సాగింది.