డిమాండ్లకు ఓకే!

ABN , First Publish Date - 2021-03-05T06:55:07+05:30 IST

కాకినాడ సెజ్‌కు సంబంధించి రైతులు, నిర్వాసితుల డిమాండ్లకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఇన్నాళ్లుగా ఇవి అపరిష్కృతంగా ఉండడంతో సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలో ఉన్నారు.

డిమాండ్లకు ఓకే!

  • కాకినాడ సెజ్‌పై బాధితుల అభ్యంతరాలు తీర్చడానికి సర్కారు సమ్మతం
  • డిమాండ్లు, అభ్యంతరాలపై కమిటీ సిఫార్సులతో కూడిన నివేదికకు ఆమోదం
  • సెజ్‌ వ్యతిరేక పోరాట సమయంలో నమోదైన కేసుల ఎత్తివేతకు అంగీకారం
  • ఆరు నిర్వాసిత గ్రామాలు అక్కడే ఉంచడానికి సమ్మతి
  • నిషిద్ధ భూముల జాబితా నుంచి పట్టా భూముల తొలగింపునకు గ్రీన్‌సిగ్నల్‌

కాకినాడ (ఆంధ్రజ్యోతి): కాకినాడ సెజ్‌కు సంబంధించి రైతులు, నిర్వాసితుల డిమాండ్లకు ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఇన్నాళ్లుగా ఇవి అపరిష్కృతంగా ఉండడంతో సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులు ఆందోళనలో ఉన్నారు. అయితే వీరి ఉద్యమాలు, నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం గతేడాది మంత్రి కన్నబాబు నేతృత్వంలో పలుశాఖల అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ సెజ్‌ బాధిత రైతులు, నిర్వాసితులతో మాట్లాడి వారి డిమాండ్లు, అభ్యంతరాలు అధ్యయనం చేసి ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందించింది. అందులోభాగంగా నివేదికలో సూచించిన అంశాలను యథాతథంగా ఆమోదిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ జీవో నెంబర్‌ 12 జారీ చేసింది. దాని ప్రకారం భూములు ఇవ్వడానికి సమ్మతించకుండా పరిహారం తీసుకోని రైతులకు సంబంధించి 2,180 ఎకరాలను తిరిగి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. నిర్వాసిత గ్రామాలను ఖాలీ చేయించకుండా అక్కడే ఉంచడానికి సమ్మతించింది. తప్పనిసరైతే రామరాఘవరపురం గ్రామాన్ని రావివారిపోడుకు తరలిస్తామని పేర్కొంది. సెజ్‌లోపల, దానికి ఆనుకుని ఉన్న నిర్వాసిత గ్రామాలకు సంబంధించి స్మశాన వాటికలను యథాతథంగా ఉంచడానికి, సెజ్‌ సమీపంలోను, చుట్టుపక్కల విక్రయించడానికి వీల్లేకుండా నిషేధం విధించిన భూముల జాబితాలోంచి పట్టా భూములను మినహాయించడానికి అంగీకరించింది. గతంలో అంగీకరించిన విధంగా ఎకరాకు అదనపు పరిహారం చెల్లింపునకు కూడా సమ్మతించింది. సెజ్‌ కు వ్యతిరేకంగా పోరాడిన సమయంలో రైతులు, ఆందోళనకారులపై నమోదైన క్రిమినల్‌ కేసులపై పునఃసమీక్షించి సాధ్యాసాధ్యాల ఆధా రంగా వెనక్కు తీసుకోవడానికి పచ్చజెండా ఊపింది. స్థానికులకు సెజ్‌ లో 75 శాతం ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సెజ్‌ ద్వారా ఏర్పా టు చేయించడానికి సమ్మతించింది. తొండంగి మండలంలో ఏర్పాటుకాబోతున్న దివిస్‌ పరిశ్రమ కాలుష్యం హేచరీలను దెబ్బతీయని విధంగా వ్యర్థ జలాలు సముద్రంలో కలిసేలా చేయడానికి అంగీకరించింది. 

Updated Date - 2021-03-05T06:55:07+05:30 IST