ముద్ర న్యాయ సలహాదారు పదవికి.. జస్టిస్ చంద్రకుమార్ రాజీనామా
ABN , First Publish Date - 2021-04-22T06:19:17+05:30 IST
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవల్పమెంట్ మల్టీ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రధాన న్యాయ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చంపాపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవల్పమెంట్ మల్టీ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రధాన న్యాయ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీ చైర్మన్ రామదాసప్పనాయుడు తాను మీడియాతో మాట్లాడినట్లు, నెల్సన్ మండేలా అవార్డుకు జస్టిస్ ప్రవీణ్కుమార్, సీపీ అంజనీకుమార్ ఎంపికైనట్లు పత్రికల్లో చూసినట్లు తెలిపారు. తాను ప్రెస్మీట్కు హాజరు కాలేదని, తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. వారు అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించలేదని, ఆ ప్రకటనతో తనకు సంబంధం లేదన్నారు. అవార్డుల గురించి తనను సలహా అడిగితే ముందు అవార్డుల కోసం ఎంపిక చేసే వారి సమ్మతి తీసుకోవాలని చెప్పానన్నారు. జస్టిస్ ప్రవీణ్కుమార్ను సంప్రదించలేదని, అతని అనుమతి తీసుకోలేదని తెలిసిందన్నారు. అవార్డు సెలక్షన్ పూర్తి కాలేదని, అలా ప్రకటించడం పొరపాటని అన్నారు. తాను ఎవరికీ లేఖ రాయలేదని, తన పేరుతో ప్రకటనలు ఇవ్వడంతో రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ఇక నుంచి ఆ సంస్థ కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.