చైనాను కట్టడి చేసేందుకు భారత్తో జో బైడెన్ చర్చలు!
ABN , First Publish Date - 2021-03-05T20:33:33+05:30 IST
ఇండో-పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్న చైనా పలుకుబడిని
వాషింగ్టన్ : ఇండో-పసిఫిక్ రీజియన్లో పెరుగుతున్న చైనా పలుకుబడిని కట్టడి చేసేందుకు క్వాడ్ దేశాలతో చర్చలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ న్యూస్ వెబ్సైట్ వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత దేశం, ఆస్ట్రేలియా, జపాన్లతో చర్చలు జరపాలని బైడెన్ నిర్ణయించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ నెలలోనే జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడి షెడ్యూలులో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. దీంతో ఇండో-పసిఫిక్ రీజియన్లో భాగస్వామ్యాలు, కూటములకుగల ప్రాధాన్యాన్ని అమెరికా వెల్లడించినట్లయింది.
దేశాధినేతలతో బైడెన్ వ్యక్తిగతంగా మాట్లాడినప్పటికీ, వీరందరితో ఒకేసారి సమావేశం నిర్వహించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ కూటమి మరింత బలపడుతుందని భావిస్తున్నారని చెప్తున్నారు. ఇదిలావుండగా, భారత దేశం, ఆస్ట్రేలియా, జపాన్లతో బైడెన్ వర్చువల్ మీట్ జరుగుతుందా? లేదా? అనే విషయాన్ని వివరించడానికి వైట్ హౌస్ నిరాకరించింది. భారత ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశంపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. గత నెలలో క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ మీట్ జరిగింది.
మోదీతో బైడెన్ ఏమన్నారంటే...
జో బైడెన్ ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో మాట్లాడారు. క్వాడ్ ద్వారా పటిష్టమైన ప్రాంతీయ నిర్మాణాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల వర్చువల్ మీట్లో చైనాపై పరోక్ష విమర్శలు గుప్పించారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
క్వాడ్ అంటే...
భారత దేశం, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి క్వాడ్ దేశాలుగా ఏర్పడ్డాయి. దీనిని నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)కు ఆసియా రూపంగా పరిగణిస్తున్నారు.