Ranchi violence: నిందితుల పోస్టర్లపై పోలీసులను వివరణ అడిగిన ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-06-16T21:23:55+05:30 IST
చట్టపరమైన అధికారం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారంతో కూడిన పోస్టర్లు వేయవద్దని అలహాబాద్ న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో ఆదేశించింది. ప్రజల గోప్యతను బహిర్గత పర్చి వారికి ఇబ్బందులు కల్పించడమే కానీ మరింకేదీ కాదు. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి పూర్తి విరుద్ధం..
రాంచీ: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల అనంతరం జార్ఖండ్లోని రాంచీలో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లకు కారణమని భావిస్తున్న నిందితుల చిత్రాలతో వేసిన పోస్టర్లను రాంచీలోని బహిరంగ ప్రదేశాల్లో పోలీసులు అంటించారు. అయితే ఇది చట్ట విరుద్ధమని, దీనిపై తమకు సమాధానం చెప్పాలని రాష్ట్ర పోలీసులను జార్ఖండ్ హోం సెక్రెటరీ రాజీవ్ అరుణ్ ఎక్కా వివరణ అడిగారు. ఇది చట్టవిరుద్ధమని మార్చి 9, 2020లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పిన తీర్పును ఎక్కా గుర్తు చేసుకున్నారు.
‘‘చట్టపరమైన అధికారం లేని వ్యక్తుల వ్యక్తిగత సమాచారంతో కూడిన పోస్టర్లు వేయవద్దని అలహాబాద్ న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో ఆదేశించింది. ప్రజల గోప్యతను బహిర్గత పర్చి వారికి ఇబ్బందులు కల్పించడమే కానీ మరింకేదీ కాదు. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21కి పూర్తి విరుద్ధం’’ అని ఎక్కా అన్నారు. మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ అభ్యంతరకర వ్యాఖ్యల అనంతరం మూడు రోజుల తర్వాత రాంచీలో ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన సాగింది. అది కాస్త అల్లర్లకు దారి తీసింది. ఈ అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించగా అనేక మంది గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన అనంతరం ఈ అల్లర్లు చెలరేగాయి.