మహిళను వెంబడిస్తూ Apartmentలోకి వచ్చిన వ్యక్తి.. ‘ఎవరు కావాలి’ అని ప్రశ్నించగా.. ఒక్కడేనా..!
ABN , First Publish Date - 2022-01-06T14:42:25+05:30 IST
మహిళను వెంబడిస్తూ Apartmentలోకి వచ్చిన వ్యక్తి.. ‘ఎవరు కావాలి’ అని ప్రశ్నించగా.. ఒక్కడేనా..!
- జీడిమెట్ల, కేపీహెచ్బీలలో చైన్ స్నాచింగ్
హైదరాబాద్ సిటీ/జీడిమెట్ల : జీడిమెట్ల, కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ల పరిధిలో బుధవారం రెండు చోట్ల చైన్ స్నాచింగ్లు జరిగాయి. ఆ రెండూ చేసింది ఒక్కడేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. జీడిమెట్ల పోలీసుల వివరాల ప్రకారం.. చింతల్ మహేంద్రనగర్కు చెందిన నరేందర్ భార్య జి. లత (60) టైలరింగ్ చేస్తారు. మంగళవారం రాత్రి 9.50 సమయంలో తన షాప్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. నీలం రంగు స్కూటీపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. నిందితుడు మాస్కు, టోపి ధరించి ఉన్నాడు.
అపార్ట్మెంట్లోకి వచ్చి..
మహిళను వెంబడిస్తూ అపార్ట్మెంట్లోకి వచ్చి స్నాచింగ్కు పాల్పడ్డాడు. కేపీహెచ్బీ పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ రోడ్నెంబర్-02లో నివసించే వెంకటేశ్వర్రెడ్డి భార్య పద్మజారెడ్డి బుధవారం రాత్రి కిరాణా దుకాణానికి వెళ్లి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమెను ద్విచక్రవాహనంపై వెంబడించాడు. అపార్ట్మెంట్ వరకు వచ్చిన అతడిని ‘ఎవరు కావాలి’ అని పద్మజారెడ్డి ప్రశ్నించగా సత్యనారాయణ కోసం వచ్చానని, ఫోన్ కలవడం లేదని తెలిపాడు. ఆ పేరుతో ఎవరూ లేరని చెబుతుండగానే.. లిఫ్ట్ వద్ద నిలబడ్డ ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునే క్రమంలో ఆమె కింద పడిపోయింది. ఇంతలో దుండగుడు ద్విచక్రవాహనంపై పరారయ్యాడు. పోలీసులు అపార్ట్మెంట్లోని సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.