పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సరఫరాకు జేసీ చర్యలు
ABN , First Publish Date - 2021-04-18T05:30:00+05:30 IST
కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వివిధ ఆసుపత్రులకు ఎటువంటి అవరోధం లేకుండా పూర్తిస్థాయిలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు జేసీ లక్ష్మీశ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ యూనిట్లు, ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు.
సర్పవరం జంక్షన్ (కాకినాడ), ఏప్రిల్ 18: కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వివిధ ఆసుపత్రులకు ఎటువంటి అవరోధం లేకుండా పూర్తిస్థాయిలో మెడికల్ ఆక్సిజన్ సరఫరాకు జేసీ లక్ష్మీశ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ యూనిట్లు, ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కాకినాడలో చలపతి గ్యాస్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20 కిలో లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ని జేసీ సందర్శించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న ఆక్సిజన్ లారీలు, లారీల నుంచి ఆక్సిజన్ అన్ లోడింగ్ చేసే ప్రక్రియను పరిశీలించారు. ఆక్సిజన్ స్టోరేజీ, ఫిల్లింగ్, సరఫరా వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. జేసీ వెంట డ్రగ్ ఇన్స్పెక్టర్ బత్తిన శ్రీనివాసరావు, సిబ్బంది వున్నారు.