రూ.45 కోట్లతో జగనన్న పచ్చతోరణం

ABN , First Publish Date - 2021-07-31T05:15:05+05:30 IST

జగనన్న పచ్చతోరణం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను సుమారు రూ.45 కోట్లు వ్యయం చేయనున్నారు.

రూ.45 కోట్లతో జగనన్న పచ్చతోరణం

1500 కి.మీ మేర మొక్కల పెంపకం

డ్వామా ప్రణాళిక

కడప, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జగనన్న పచ్చతోరణం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను సుమారు రూ.45 కోట్లు వ్యయం చేయనున్నారు. రహదారులు, కాలువల వెంబడి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, అటవీ, దేవదాయశాఖ, ఏపీఐఐసీ భూముల్లో మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఈ మేరకు డ్వామా పీడీ యధుభూషణ్‌రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. 1500 కి.మీ మేర రహదారులు, కాలువల వెంబడి ఆరు లక్షల మొక్కలు నాటేలా నిర్ణయించారు. కి.మీకు 400 మొక్కలు నాటనున్నారు. వేప, చింత, నిద్రగన్నేరు, సీమతంగేడు, కానుగ, తెల్లమద్ది, నల్లమద్ది, ఉసిరి, కానుగతో పాటు మరికొన్ని జాతుల మొక్కలు నాటనున్నారు. విద్యాసంస్థల్లో 60వేల మొక్కలు, 2వేల ఎకరాల్లో బ్లాక్‌ ప్లాంటేషనను నాటనున్నారు. ఇవన్నీ కలిపి 3.40 లక్షల మొక్కలు నాటుతారు.


రూ.45 కోట్లు ఖర్చు

జగనన్న పచ్చతోరణం ద్వారా నాటే మొక్కలకు మొత్తం రూ.45 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొక్క కోసం గుంత తీయడం, నాటడం, ట్రాన్సపోర్టు, మొక్కలకు నీళ్లు పోయడం నిర్వహణ కోసం రెండేళ్లలో రూ.45 కోట్లు ఖర్చు చేస్తారు. ఈసారి ఆరడుగుల మొక్కను నాటుతారు. పశువుల నుంచి మొక్కలను సంరక్షించేందుకు రూ.140 వెచ్చించి కంచెను ఏర్పాటు చేస్తారు.


నిర్వహణ ఇలా..

మొక్కల సంరక్షణకు గాను 200 మొక్కలకు ఒక వాచర్‌ను నియమిస్తారు. ఇందుకు గాను అతనికి ఉపాధి ద్వారా వందదినాల పని కల్పిస్తారు. అంటే ఏడాదికి రూ.25వేలు వస్తుంది. మొక్కలకు నీరు పడితే ఒకసారి ఒక్కో మొక్కకు రూ.5 ఇస్తారు. నెలకు నాలుగు సార్లు నీళ్లు పోయాలి. అంటే మొక్కకు రూ.20 చెల్లిస్తారు. కి.మీ మేర మొక్కలకు నీళ్లు పోస్తే రూ.8వేలు ఇస్తారు. గ్రామకమిటీ సూచించిన వారికి నీళ్లు పోసే బాధ్యత అప్పగిస్తారు.

Updated Date - 2021-07-31T05:15:05+05:30 IST