ప్రతి పేదవాడిని ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ
ABN , First Publish Date - 2022-08-18T06:27:40+05:30 IST
కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడిని ఆదుకున్నదని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు పేర్కొన్నారు.
హుజూరాబాద్, ఆగస్టు 17: కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడిని ఆదుకున్నదని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హన్మంతరావు పేర్కొన్నారు. బుధవారం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేస్తున్న పాదయాత్ర 9వ రోజు హుజూరాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా హన్మంతరావు హాజరై మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడిన భాషతో రాజకీయాల్లోకి రావాలంటేనే సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అప్పటి ప్రధాని రాజీవ్గాంధీ ముందు చూపు తోనే నేడు యువతకు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు లభించాయన్నారు. బీజేపీలో దేశం కోసం త్యాగం చేసిన వారు ఒక్కరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. భారత దేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుందన్నారు. అనంతరం మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్రావు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలు : పొన్నం ప్రభాకర్
ప్రజాస్వామ్యాన్ని చంపి బీజేపీ ఉప ఎన్నికలు నిర్వహిస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం పొన్నం ప్రభాకర్ చేస్తున్న పాదయాత్ర హుజూరాబాద్కు చేరుకుంది. మొదట ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సింగాపూర్లో మాజీ ఎంపీ పొన్నంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పొన్నం విలేకరులతో మాట్లా డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు పెంచడంతో ఆ పార్టీలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్చార్జీ బల్మూరి వెంకట్, పత్తి కృష్ణా రెడ్డి, సొల్లు బాబు, గూడూరి స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.