అనుమతులు లేకుండా టీటీడీ స్థలాలు వినియోగించటం తగదు

ABN , First Publish Date - 2021-06-24T05:04:52+05:30 IST

ప్రొద్దుటూరు పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)కి చెందిన జూటూ రు రమణయ్య కళాక్షేత్రం ప్రహరీ గోడను తొలగించి లోపల ఖాళీ స్థలాన్ని ఎలాంటి అనుమతులు లేకుం డా వాహనాల పార్కింగ్‌కు వినియోగించటంపై తిరుపతి నుంచి వచ్చిన టీటీడీ రెవెన్యూ అధికారుల బృందం విచారణ చేపట్టింది.

అనుమతులు లేకుండా టీటీడీ స్థలాలు వినియోగించటం తగదు
వైసీపీ నేతలను విచారిస్తున్న టీటీడీ అధికారులు

ప్రొద్దుటూరు అర్బన్‌, జూన్‌ 23 : ప్రొద్దుటూరు పట్టణంలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ)కి చెందిన జూటూ రు రమణయ్య కళాక్షేత్రం ప్రహరీ గోడను తొలగించి లోపల ఖాళీ స్థలాన్ని ఎలాంటి అనుమతులు లేకుం డా వాహనాల పార్కింగ్‌కు వినియోగించటంపై తిరుపతి నుంచి వచ్చిన టీటీడీ రెవెన్యూ అధికారుల బృందం విచారణ చేపట్టింది. బుధవారం టీటీడీ రెవిన్యూ విభాగపు తహసీల్దారు లలితాంజలి, డిప్యూటీ తహసీల్దారు చైనులు, డిప్యూటీ సర్వేయర్‌ దీప, డీఈఈ రాజశేఖర్‌ల బృందం జూటూరు రమణయ్య కళాక్షేత్రంలో తొలగించిన ప్రహరీని, పార్కింగ్‌ కోసం చదును చేసిన ఖాళీ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా వైసీపీ నేతలు బంగారు మునిరెడ్డి, వరికూటి ఓబులరెడ్డిలు తామే మున్సిపల్‌ తాత్కాలిక మార్కెట్‌కు పార్కింగ్‌ సౌకర్యం కోసం ఖాళీగా వున్న ఈ స్థలాన్ని వినియోగించుకోవడానికి ప్రహరీని తొలగించామన్నారు. ఇందుకు టీటీడీ తహసీల్దారు లలితాంజలి స్పందిస్తూ శ్రీవారి ఆస్తులను వినియోగించుకోవడానికి అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా టీటీడీ ఈవో పేరిట వినతి పత్రం రాసి పంపాలన్నారు.  ఈ మేరకు కౌన్సిలర్‌ వరికూటి ఓబులరెడ్డి,  స్థానిక ఆర్‌ఐ సుదర్శన్‌ వీఆర్‌ఓ సుధాతో పంచనామాపై సంతకాలు తీసుకున్నారు.  

Updated Date - 2021-06-24T05:04:52+05:30 IST