ఇస్రో గూఢచర్యం కేసు మళ్లీ సీబీఐకి
ABN , First Publish Date - 2021-04-16T07:17:44+05:30 IST
ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్పై దాఖలైన గూఢచర్యానికి సంబంధించిన కేసులో
లోతుగా దర్యాప్తు జరపాలని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్పై దాఖలైన గూఢచర్యానికి సంబంధించిన కేసులో దోషులైన పోలీసు అధికారుల పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. తప్పుడు అభియోగాలు మోపిన పోలీసుల పాత్రపై ఉన్నతస్థాయి కమిటీ సమర్పించిన నివేదికను సీబీఐకి అందించాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్ ఖాన్విల్కర్ నేతృత్వంలోని ఽధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ఉన్నతస్థాయి కమిటీ నివేదికను ప్రాథమిక దర్యాప్తుగా పరిగణించి మరింత లోతుగా దర్యాప్తు జరిపి 3 నెలల్లో నివేదిక సమర్పించాల్సిందిగా ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
ఇస్రో కేసులో కేరళ పోలీసుల తప్పిదాలపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ విచారించి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. గతంలో ఈ కేసుపై దర్యాప్తు జరిపిన సీబీఐ...నారాయణన్ను నిర్దోషిగా పేర్కొంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులపై నంబి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు.