ప్రభుత్వ బడుల్లో చేర్పించండి
ABN , First Publish Date - 2020-07-07T10:28:22+05:30 IST
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల విజ్ఞప్తి
నెల్లూరు (విద్య) జులై 6 : ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల పేర్లు, ఫోన్ నెంబర్లను ప్రభుత్వ పాఠశాలలకు అందచేశారు. ఈ వివరాల ఆధారంగా ఉపాధ్యాయులు నిత్యం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘‘మీ పిల్లలను మా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి.
గతంలోలా కాకుండా వంద శాతం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్నాం. అడ్మిషన్ ఫీజులు కూడా చెల్లించకుండానే నాణ్యమైన విద్య అందిస్తాం.’’ అంటూ అభ్యర్థిస్తున్నారు. అలాగే ప్రభుత్వ నుంచి అందే ఫలాలనూ వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరికోటలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సోమవారం షార్ లేబర్ కాలనీలలో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఆల్తాఫ్, సీఆర్పీ హేమభూషణం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.