కోజికోడ్ ప్రమాద దర్యాప్తులో అంతర్జాతీయ సంస్థలు
ABN , First Publish Date - 2020-08-10T06:34:32+05:30 IST
కోజికోడ్ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో), విమాన ప్రమాదాల విశ్లేషణ సంస్థలతోపాటు.. బోయింగ్ సంస్థ కూడా దర్యాప్తు చేస్తుందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది...
కోజికోడ్, ఆగస్టు 9: కోజికోడ్ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో), విమాన ప్రమాదాల విశ్లేషణ సంస్థలతోపాటు.. బోయింగ్ సంస్థ కూడా దర్యాప్తు చేస్తుందని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ వెల్లడించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)ల ప్రాథమిక దర్యాప్తులో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, భారీ వర్షం, రన్వేపై నీళ్లు నిలవడం, ట్యాక్సీవేపై విమానం ల్యాండ్ అవ్వడమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. తమకు కేటాయించిన టెర్మినళ్లను చేరేందుకు ఉపయోగించే మార్గాలనే ట్యాక్సీవే అంటారు. ఇవి విమానం బరువును తట్టుకోగలవేకానీ, ల్యాండింగ్కు, టేకా్ఫకు పనికిరావు. కాగా, ఆదివారం మధ్యాహ్నానికి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు.
పైలట్ దీపక్ సాథే మృతదేహానికి ముంబై, కో-పైలట్ అఖిలేశ్ కుమార్ మృతదేహానికి ఢిల్లీ విమానాశ్రయంలో నివాళులర్పించారు. అఖిలేశ్ అంత్యక్రియలను మథురలో నిర్వహించారు. ప్రమాదంపై మంత్రి హర్దీ్పసింగ్ పురీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి డిమాండ్ చేశారు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ భారీ బీమాకు క్లెయిమ్ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.