రేపటి నుంచి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ
ABN , First Publish Date - 2022-08-02T05:09:47+05:30 IST
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రతిపదికగా ఈ నెల 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి.
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ఉమ్మడి జిల్లా ప్రతిపదికగానే నిర్వహణ
సాలూరు రూరల్, ఆగస్టు 1: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లా ప్రతిపదికగా ఈ నెల 3 నుంచి 12 వరకు జరుగనున్నాయి. పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీ ప్రచారం, ప్రశ్నపత్రాలంటూ వాట్సాప్లో హల్చల్ చేయడం తదితర ఘటనల నేపథ్యంలో ఈ పరీక్షలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, కస్టోడియన్తో పాటు తనిఖీలకు వచ్చే స్క్వాడ్లు సైతం సెల్ఫోన్తో ప్రవేశించకూడదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ పరీక్షలు మొదటి ఏడాది విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో ఏడాది వారికి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి.
పకడ్బందీగా నిర్వహణ
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం. ఈ విషయమై తీసుకోవాల్సిన కార్యాచరణపై ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చాం. విద్యార్థులు ఫీజు చెల్లించినా.. లేకపోయినా ప్రైవేట్ కాలేజీలు హాల్ టిక్కెట్లు ఇవ్వాలి. ఇవ్వకుంటే చర్యలు తప్పవు.
- ఆదినారాయణ, ఆర్ఐవో, ఇంటర్మీడియట్ బోర్డు, విజయనగరం