Stone-Pelting Festival: మధ్యప్రదేశ్లో జరిగే గోత్మార్ జాతర ఆచారం గురించి వింటే షాక్.. ప్రాణాలతో చెలగాటమే..
ABN , First Publish Date - 2022-08-28T01:58:22+05:30 IST
ప్రపంచంలో రకరకాలు తెగలు, జాతులకు చెందిన ప్రజలు తమవైన పురాతన ఆచారలతో పండుగలను జరుపుకుంటారు.
ప్రపంచంలో రకరకాలు తెగలు, జాతులకు చెందిన ప్రజలు తమవైన పురాతన ఆచారలతో పండుగలను జరుపుకుంటారు. అందులో కొన్ని మనకు చాలా వింతగా అనిపిస్తుంటాయి. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని చింద్వారా జిల్లాలో జరిగే గోత్మార్ జాతర (Gotmar festival) గురించి వింటే వింతగా కాదు.. చాలా భయం కలుగుతుంది. ఎందుకంటే ఆ పండుగ ఆచారంలో భాగంగా కొన్ని వందల మంది ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకుంటారు. ఆ పోటీలో ఎంతో మంది గాయపడతారు. కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. ఈ రోజు (శనివారం) నిర్వహించిన జాతరలో సుమారు 200 మందికి గాయాలయ్యాయని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇది కూడా చదవండి..
Viral: ఆ తండ్రికి ఎంత కష్టమొచ్చిందో.. ప్రియుడితో భార్య వెళ్లిపోవడంతో ఏడాది కొడుకును ఎత్తుకుని రిక్షా తొక్కుతూ..
`గోత్మార్' జాతర నేపథ్యం ఏంటి?
దాదాపు 300 ఏళ్ల క్రితం ఈ ఆనవాయితీ ప్రారంభమైందని స్థానికులు చెబుతారు. చింద్వారా జిల్లాలో ప్రతి ఏటా ఈ జాతర జరుగుతుంది. ఈ పండుగ వెనుక ఒక ఆసక్తికర ప్రేమకథ ఉంది. 'జామ్' అనే నదికి ఒకవైపు ఉన్న పాంధుర్ణ గ్రామానికి చెందిన అబ్బాయి, మరోవైపు ఉన్న సావర్గావ్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయి ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు వివాహం చేసుకోవాలనుకున్నారు. ఆ పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఆ అబ్బాయితో అమ్మాయి పారిపోయేందుకు ప్రయత్నించింది. ఇద్దరూ జామ్ నదిని దాటుతున్న సమయంలో, అమ్మాయి తరఫు వారు దాడి చేశారు. అబ్బాయిపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న పాంధుర్ణా వాసులు కూడా జామ్ నది ఒడ్డుకు చేరుకుని అబ్బాయిని కాపాడేందుకు రాళ్లు రువ్వారు. ఇరువైపుల నుంచి రాళ్ల దాడి జరగడంతో ఆ ప్రేమికులు జామ్ నదిలోనే మరణించారు. ఆ ఇద్దరి మృతదేహాలను అందరూ కలిసి నది నుంచి బయటకు తీసి చండికా ఆలయంలో పూజలు చేసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి యేటా వారి గుర్తుగా ఆ పండగ చేస్తుంటారు. జామ్ నదిలో ఓ ఎండిపోయిన చెట్టుకు జెండా కడతారు. ఆ జెండాను తీయడానికి ఇరు గ్రామాలకు చెందిన వారు పోటీపడతారు. ఆ సమయంలో జామ్ నదికి ఒకవైపు సావర్గావ్ వాసులు, మరోవైపు పాంధుర్ణా గ్రామస్థులు నిలబడి పోటీలో ఉన్న వారిపై రాళ్లు విసురుతారు.