పండ్ల మొక్కల్లో అంతర్‌ పంటలు సాగు చేయాలి

ABN , First Publish Date - 2021-09-29T06:00:39+05:30 IST

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పండ్ల మొక్కల పెంపకంతోపాటు అంతర్‌పంటలు కూడా సాగు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ పేర్కొన్నారు.

పండ్ల మొక్కల్లో అంతర్‌ పంటలు సాగు చేయాలి
పండ్ల మొక్కలను పరిశీలిస్తున్న కమిషనర్‌, కలెక్టర్‌ తదితరులు


: పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌

నార్పల, సెప్టెంబరు28: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పండ్ల మొక్కల పెంపకంతోపాటు అంతర్‌పంటలు కూడా సాగు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవల్‌పమెంట్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌ పేర్కొన్నారు. మంగళవారం ఉపాధి హామీ పథకం కింద నార్పల పరిధిలోని రైతులు చెన్నారెడ్డి, హరికృష్ణారెడ్డి పొలాల్లో హార్టికల్చర్‌ ప్లాంటేషనను పంచాయతీరాజ్‌ కమిషనర్‌, స్పెషల్‌ కమిషనర్‌ శాంతిప్రియపాండే, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, మెంబర్‌ సెక్రటరీ శివారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ గిరిజాశంకర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకం కింద హార్టికల్చర్‌ ప్లాంటేషన కోసం మూడేళ్లకు ఎకరాకు నీటి సరఫరా, మందులు, మొక్కల సంరక్షణ నిమిత్తం రూ.1.62 లక్షలు ఖర్చు పెడుతోందన్నారు. పొలంలో మామిడి మొక్కల పెంపకంతోపాటు అంతర్‌పంటలను కచ్చితంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. మొదటి పేమెంట్‌ ఇవ్వడానికి ముందు పొలంలో ఎంత విస్తీర్ణంలో హార్టికల్చర్‌ ప్లాంటేషన కింద మొక్కలు పెంచారు, ఎంత ఖర్చవుతోంది లాంటి వివరాలతో బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మడుగుపల్లి రోడ్డులోని కొండమీద 2020-21లో ఉపాధి హామీ కింద చేపట్టిన ఖండిత కందకాలను పరిశీలించారు. ఎంత లోతుతో తవ్వారు, ఎన్ని గ్రూపులు, ఎంతమంది కార్మికులు వచ్చి.. ఎన్ని పనిదినాలు చేశారు తదితర వివరాలను ఆరాతీశారు. కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, ఏపీడీ నీలిమ, ఏపీఓ తులసిప్రసాద్‌, ఎంపీడీఓ దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T06:00:39+05:30 IST