జోరందుకున్న ఖరీఫ్‌ సాగు

ABN , First Publish Date - 2022-07-02T05:11:17+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్‌) సాగు పనులు జోరందుకున్నాయి.

జోరందుకున్న ఖరీఫ్‌ సాగు
మరికల్‌ మండలంలో విత్తనాలు విత్తుతున్న కూలీలు

- జిల్లాలో కంది, పత్తి సాగుపై అన్నదాతల ఆసక్తి

- 2,21,852 లక్షల ఎకరాల్లో విత్తిన పంటలు

నారాయణపేట, జూలై 1 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా వానాకాలం (ఖరీఫ్‌) సాగు పనులు జోరందుకున్నాయి. రెండురోజులుగా మోస్తరు వర్షం కురియడంతో రైతులు వర్షాధార పంటలైన కంది, పత్తి సాగుచేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో ట్రాక్టర్లు, గొర్రు, గునుకలకు ఎనలేని డిమాండ్‌ నెల కొంది. పత్తి విత్తనాలు విత్తేందుకు ట్రాక్టర్లు, కూలీల కొరత ఏర్పడటంతో అన్నదాతలు ఇతర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించుకొని విత్తే పనుల్లో ఉన్నారు. కాగా జిల్లాలోని 11 మండలాల్లో ఖరీఫ్‌లో 4,25,032 లక్షల ఎకరాల సాగుకు గానూ ఇప్పటి వరకు 2,21,852 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. వరి 85వేల ఎకరాల సాగుకు గాను 15వేల ఎకరాల్లో బోర్ల కింద నారు మళ్లను వేశారు. జొన్న ఎనిమిది వేల ఎకరాలకు గాను ఐదు వేల ఎకరాల్లో విత్తారు. కంది 1.40 లక్షల ఎకరాలకు గాను 60 వేల ఎకరాల్లో, పత్తి 1,82,317 లక్షల ఎకరాలకు గాను 1.40 లక్షల ఎకరాల్లో, వేరుశనగ 215 ఎకరాలకు గాను వంద ఎకరాల్లో సాగు చేశారు. ఆముదం 4,500 ఎకరాలకు గాను 200 ఎకరాల్లో, చెరుకు 1000 ఎకరాలకు గాను 652 ఎకరాల్లో సాగు చేయగా ఇతర పంటలు నాలుగు వేల ఎకరాలకు గాను 900 ఎకరాల్లో సాగు చేశారు. 



Updated Date - 2022-07-02T05:11:17+05:30 IST