తక్షణమే..

ABN , First Publish Date - 2022-06-21T05:22:36+05:30 IST

గతంలో గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే బాగు చేయడానికి కనీసం వారం రోజులు పట్టేది.

తక్షణమే..
మరమ్మతు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లను ట్రాక్టర్‌లో గ్రామాలకు తరలిస్తున్న సిబ్బంది


  • కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు  మరమ్మతులు
  • టౌన్‌లో ఆరు గంటలు, గ్రామాల్లో 24 గంటల్లో ఏర్పాటు 
  • మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తే గంటలో అమర్చే అవకాశం

గతంలో గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే  బాగు చేయడానికి కనీసం వారం రోజులు పట్టేది. ప్రస్తుతం 24 గంటల్లోనే  మరమ్మతులు చేసి అమర్చుతున్నారు. ఇక పట్టణాల్లో ఆరు గంటల్ల్లో అమర్చుతున్నారు.  కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లను తక్షణమే అమర్చేందుకు విద్యుత్‌ శాఖ  అధికారులు  ప్రత్యేక చొరవ చూపుతున్నారు. 

తాండూరు, జూన్‌ 20: వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 25వేల వరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. మరో 10వేల ట్రాన్స్‌ఫార్మర్ల వరకు అవసరం ఉంటుందని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. వేసవి కాలంలో పట్టణంలోనే అధికంగా విద్యుత్‌ వాడకం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. అయితే జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ బోర్ల నీటి వాడటం పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయి.  దీంతో జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వివిధ పట్టణాల్లో మొబైల్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు ఉండటంతో ఎక్కడైతే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే అరగంటలోనే వేరే ట్రాన్స్‌ఫార్మర్‌ను అమర్చి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌ మరమ్మతు చేసి రెడీగా ఉంచుతారు. అయితే తాండూరులో కూడా మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ అవసరం ఉందని, ఇందు కోసం రూ.10లక్షల మేరకు వ్యయం అవుతుందని అంచనా వేసి ఇటీవల తాండూరుకు వచ్చిన విద్యుత్‌ నియంత్రణ మండలి రాష్ట్ర చైర్మన్‌కు స్థానిక అధికారులు విన్నవించారు. అయితే ట్రాన్స్‌ఫార్మర్లను మార్చేందుకు ఎవరూ డబ్బులు చెల్లించరాదని, విద్యుత్‌ శాఖకు చెందిన వాహనంలోనే తీసుకువచ్చి అమర్చుతామని వినియోగదారుల ముఖాముఖి సమావేశంలో విద్యుత్‌ నియంత్రణా మండలి చైర్మన్‌ తేల్చి చెప్పారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఆ గ్రామ సర్పంచ్‌ లేక ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ కింద సాగు చేసుకుంటున్న రైతులు డబ్బులు చెల్లించి వారే తీసువచ్చి మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకెళ్లే వారు. అంతేకాకుండా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లపై సబ్సిడీ పెరగకపోవడంతో   పెరిగిన ఎస్టిమెట్ల భారాన్ని రైతులే భరించవలసి వస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఈ పద్దతికి స్వస్థి పలకాలని చైర్మన్‌ వినియోగదారులకు సూచించారు. ఇదిలా ఉంటే చాలా చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకపోవడం వల్ల అనేక పశువులు షార్ట్‌ సర్క్యూట్‌తో మృత్యువాత పడుతున్నాయి. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. విద్యుత్‌ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతోపాటు వాటికి కంచె ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2022-06-21T05:22:36+05:30 IST