అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చండి : కేంద్రం

ABN , First Publish Date - 2021-07-27T22:26:46+05:30 IST

దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలను

అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చండి : కేంద్రం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. 


దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు గత ఏడాది డిసెంబరు 2న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని నిత్యానంద్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 6న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో ఒక నెలలోగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు బడ్జెట్ కేటాయించాలని ఆదేశించినట్లు తెలిపారు. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా సీసీటీవీ కెమెరాలను అమర్చాలని తెలిపిందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్ 13న బడ్జెట్ కేటాయింపులను కోరినట్లు వివరించారు. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై యథాతథ స్థితిని వివరించేందుకు నేరుగా సుప్రీంకోర్టుకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఈ కేసులో చేరినట్లు పేర్కొన్నారు. 


పోలీసు శాఖ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుందని, అందువల్ల పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం వద్ద రికార్డులు లేవని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్లలోనూ వీటిని ఏర్పాటు చేయాలని జూలై 8న మార్గదర్శకాలను జారీ చేశామని చెప్పారు. పోలీసు దళాల ఆధునికీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందన్నారు. 


Updated Date - 2021-07-27T22:26:46+05:30 IST