అభివృద్ధి పనులపై ఆరా
ABN , First Publish Date - 2022-08-16T05:19:49+05:30 IST
ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మండలానికి మంజూరు చేసిన అభివృద్ధి పనుల పరిస్థితిపై అధికారులు తీరా తీస్తున్నారు.
డీఆర్పీల పరిశీలన
ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక
జియ్యమ్మవలస, ఆగస్టు 15 : ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మండలానికి మంజూరు చేసిన అభివృద్ధి పనుల పరిస్థితిపై అధికారులు తీరా తీస్తున్నారు. ఈ మేరకు జిల్లా రిసోర్స్పర్సన్లు (డీఆర్పీ) పీవీ రాంప్రసాద్, జి.జగదీష్, టి.నాగరాజుతో కూడిన బృందం పంచాయతీరాజ్, ఐటీడీఏ, గృహ నిర్మాణశాఖ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ద్వారా మంజూరైన పనులను పరిశీలించి ఆన్లైన్లోనే నివేదిక పంపిస్తున్నారు. సోమవారం వీరు తురకనాయుడువలస పంచాయతీలో పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మాట్లాడుతూ.. 2019లో ప్రభుత్వం ఈ మండలానికి 203 పనులు మంజూరు చేసిందన్నారు. ఇందులో పంచాయతీరాజ్ ద్వారా 147 సీసీ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 16 సీసీ డ్రైన్లు, ఐటీడీఏ ద్వారా 38 కాంపౌండ్ వాల్స్, బీటీ రోడ్లు, గృహ నిర్మాణశాఖ ద్వారా రెండు వ్యక్తి మరుగుదొడ్లు పనులు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం వాటికి ఫొటోలు, వీడియోలు తీసి ఆన్లైన్లో నివేదిక పంపిస్తామన్నారు. ఒకవేళ పనులు జరగకపోతే స్థానికుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. వాటిని ఆపేయాలా లేదా కొనసాగించాలనేది కూడా ఆన్లైన్లోనే ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.