ఆగస్టు 15 నాటికి తొలి ‘మేడిన్ ఇండియా’ కరోనా వ్యాక్సిన్!

ABN , First Publish Date - 2020-07-04T01:10:16+05:30 IST

తొలి ‘మేడిన్ ఇండియా’ కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆగస్టు 15 నాటికి తొలి ‘మేడిన్ ఇండియా’ కరోనా వ్యాక్సిన్!

న్యూఢిల్లీ:  తొలి ‘మేడిన్ ఇండియా’ కరోనా వ్యాక్సిన్ ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్).. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కరోనా టీకా ‘కోవాక్సిన్’ను త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 15 నాటికి దేశంలో తొలి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుంది.


స్వదేశీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ (బీబీబీ152) క్లినికల్ ట్రయల్స్ కోసం దాదాపు డజను ఇనిస్టిట్యూషన్లు ఎంపిక చేసినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షించబడే అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు కాబట్టి క్లినికల్ ట్రయల్స్‌ను పెంచాలని ఐసీఎంఆర్ ఈ సంస్థలను కోరింది. 


ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా  ప్రజారోగ్య వినియోగం కోసం ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐసీఎంఆర్ ప్రయత్నిస్తుండగా, ఇప్పటి వరకు క్లినికల్ ట్రయల్సే ప్రారంభం కాకపోవడంతో అది ఎంత వరకు సాధ్యమన్న ప్రశ్న వేధిస్తోంది. "అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాత 2020 ఆగస్టు 15 నాటికి ప్రజారోగ్య వినియోగం కోసం వ్యాక్సిన్‌ను విడుదల చేయాలని భావిస్తున్నాం" అని పరిశోధనా సంస్థ తెలిపింది. అయితే, తుది ఫలితం ఈ ప్రాజెక్టులో పాల్గొన్న అన్ని క్లినికల్ ట్రయల్ సైట్ల సహకారంపై ఆధారపడి ఉంటుందని ఐసీఎంఆర్ పేర్కొంది.

Updated Date - 2020-07-04T01:10:16+05:30 IST