మజారే షరీఫ్ నుంచి భారతీయులను రప్పిస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-08-10T22:39:23+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో భారతీయులను
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో భారతీయులను రప్పించే ప్రయత్నాలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. బల్ఖ్ ప్రావిన్స్ రాజధాని నగరం మజారే షరీఫ్లోని భారత కాన్సులేట్ అధికారులు, సిబ్బందిని వెనుకకు పిలిపిస్తోంది. ఈ నగరంలో తాలిబన్ల హింసాత్మక చర్యలు తీవ్రమవడంతో ఈ చర్యలు చేపట్టింది.
మజారే షరీఫ్, దాని పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయులను, ఇండియన్ కాన్సులేట్ సిబ్బందిని న్యూఢిల్లీకి తీసుకెళ్లేందుకు ఓ ప్రత్యేక భారత వాయుసేన విమానం బయల్దేరుతోందని ఇండియన్ కాన్సులేట్ ఓ ట్వీట్లో మంగళవారం తెలిపింది. మంగళవారం రాత్రి ఈ విమానం మజారే షరీఫ్ నుంచి బయల్దేరుతుందని పేర్కొంది. ఈ విమానంలో ప్రయాణించాలనుకునేవారు తమ పేరు, పాస్పోర్టు వివరాలను వాట్సాప్ ద్వారా వెంటనే సమర్పించాలని కోరింది. మజారే షరీఫ్లోని ఇండియన్ కాన్సులేట్ కార్యకలాపాలను స్థానిక సిబ్బందితో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘన్ దళాలు, తాలిబన్ ఉగ్రవాదుల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో గత నెలలో కాందహార్ నుంచి కూడా ఇదే విధంగా భారతీయులను ఖాళీ చేయించారు. 50 మంది దౌత్యవేత్తలు, భద్రతా సిబ్బందిని కాందహార్ ఇండియన్ కాన్సులేట్ నుంచి తరలించారు. భారత వాయు సేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుతం దాదాపు 1,500 మంది భారతీయులు ఉన్నారు. వీరి భద్రత కోసం అవసరమైన చర్యలను చేపట్టినట్లు, అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంటుకు ఇటీవల తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ మే 1న ప్రారంభమైంది. అత్యధిక భాగం దళాలు వెనుకకు వెళ్ళిపోయాయి. ఈ నెల 31నాటికి ఉపసంహరణ పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో తాలిబన్ల హింసాత్మక చర్యలు తీవ్రరూపం దాల్చాయి.