చైనాకు ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే ఘాటైన సందేశం

ABN , First Publish Date - 2022-01-15T19:22:31+05:30 IST

దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాకు భారత సైన్యాధ్యక్షుడు

చైనాకు ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే ఘాటైన సందేశం

న్యూఢిల్లీ : దురాక్రమణ బుద్ధితో రగిలిపోతున్న చైనాకు భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఎంఎం నరవనే స్పష్టమైన సందేశం ఇచ్చారు. సరిహద్దుల్లో యథాతథ స్థితిని మార్చడానికి జరిగే ప్రయత్నాలను విజయవంతం కానివ్వబోమని చెప్పారు. ఆర్మీ డే పరేడ్ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ తూర్పు లడఖ్‌లో చైనాతో ప్రతిష్టంభన గురించి ప్రస్తావించారు. 


‘‘మా సందేశం సుస్పష్టం. దేశ సరిహద్దుల వెంబడి యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను భారత సైన్యం విజయవంతం కానివ్వదు’’ అని జనరల్ నరవనే చెప్పారు. గత ఏడాది సైన్యానికి అత్యంత సవాళ్ళు ఎదురయ్యాయని చెప్పారు. వివిధ స్థాయుల్లో ఉమ్మడి కృషి వల్ల చాలా ప్రాంతాల్లో దళాల ఉపసంహరణ జరిగిందని, ఇది నిర్మాణాత్మక పరిణామమని తెలిపారు. పరిస్థితిని నియంత్రణలో ఉంచడానికి భారత్-చైనా మధ్య సైనిక స్థాయి చర్చలు 14వ విడత ఇటీవల జరిగాయని తెలిపారు. 


పశ్చిమ సరిహద్దుల్లో (పాకిస్థాన్) నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితిని ప్రస్తావిస్తూ, గత సంవత్సరం కన్నా ఈ ఏడాది పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. అయితే పాకిస్థాన్ ఇప్పటికీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందని చెప్పారు. 


సాయుధ దళాల్లో మహిళల పాత్ర గురించి మాట్లాడుతూ, మహిళలకు సమానావకాశాలు ఇవ్వడానికి సైన్యం ముఖ్యమైన చర్యలను తీసుకుందని తెలిపారు. ఇప్పుడు మహిళలు ఉన్నత స్థాయి బాధ్యతలను నిర్వహించవచ్చునని తెలిపారు.  ఈ ఏడాది నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)లోకి మహిళా క్యాడెట్లను చేర్చుకుంటామని తెలిపారు. ఆర్మీ పైలట్లుగా కూడా మహిళలు పని చేయవచ్చునని చెప్పారు. 


Updated Date - 2022-01-15T19:22:31+05:30 IST