తాలిబన్లపై భారత సైన్యం మేధోమథనం
ABN , First Publish Date - 2021-08-29T17:18:36+05:30 IST
ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు భారత దేశ భద్రతపై చూపగలిగే ప్రభావంపై
న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లు భారత దేశ భద్రతపై చూపగలిగే ప్రభావంపై భారతీయ సైనిక దళాలు మేధోమథనం నిర్వహించబోతున్నాయి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలో త్రివిధ దళాల అధిపతులు ఓ అధ్యయనాన్ని నిర్వహిస్తారు. ఆఫ్ఘనిస్థాన్లో బలపడిన తాలిబన్లకు పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలతో అన్ని విధాలుగా అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే.
తాలిబన్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. తాలిబన్లకు పాకిస్థాన్లోని తెహరీక్-ఈ-తాలిబన్, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు సైద్ధాంతిక, కార్యకలాపాలకు సంబంధించిన అనుబంధం ఉంది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ఆధిపత్యం సంపాదించడంతో భారత దేశంపై దాని ప్రభావం ఎలా ఉంటుందో త్రివిధ దళాల అధిపతులు అధ్యయనం చేస్తారు. ఆఫ్ఘనిస్థాన్లో అమెరికా దళాలు లేనందువల్ల ఈ అంశం తొలిసారి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆఫ్ఘనిస్థాన్లో బిలియన్ల డాలర్ల విలువైన హార్డ్వేర్ను అమెరికా వదిలిపెట్టింది. భారత ఉప ఖండంలోని జీహాదిస్టులు ఎం-4, ఎం-16 వంటి అత్యాధునిక రైఫిల్స్ను సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిలిటరీ గ్రేడ్ నైట్ విజన్ డివైసెస్, వ్యూహాత్మక డ్రోన్లు, ఇతర ఆయుధాలను జీహాదిస్టులు సేకరించే అవకాశం అధికంగా ఉంది. అమెరికాలో తయారైన ఈ మిలిటరీ హార్డ్వేర్ పంజాబీ ఇస్లామిస్ట్ గ్రూపులకు చేరే అవకాశం కనిపిస్తోంది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలకు ఈ ఆయుధాలు చేరి, భారత దేశంలోని కశ్మీరుపై దాడులు పెరగవచ్చు. ఆఫ్ఘనిస్థాన్లో వదిలిపెట్టిన బ్లాక్హాక్ హెలికాప్టర్లను, అన్ని రకాల పరిస్థితుల్లోనూ పని చేసే మిలిటరీ వాహనాలను తాలిబన్లు నడపగలిగితే, భద్రత పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయి.
ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్లకు, పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలకు సత్సంబంధాలు ఉన్నాయి. భారత దేశంలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే, అందుకు బాధ్యత తమది కాదని పాకిస్థాన్ తప్పించుకోగలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాలిబన్లు ఇరవయ్యేళ్ళ క్రితం ఆఫ్ఘనిస్థాన్ను పరిపాలించినప్పటి మాదిరిగానే, ఇప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలు తమ శిక్షణ శిబిరాలను ఆ దేశానికి తరలించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు తాలిబన్లు, హక్కానీ నెట్వర్క్ మద్దతుగా నిలుస్తాయని భావిస్తున్నారు. భారత దేశానికి తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో చైనా సైన్యం సమస్యలు సృష్టిస్తూండగా, పశ్చిమం వైపున చైనా, పాకిస్థాన్ల మద్దతుతో జీహాదిస్టులు భారత దేశంపై ఒత్తిడి పెంచుతాయని అంచనా వేస్తున్నారు.
సముద్రంపై పెద్ద ఎత్తున ఉగ్రవాదులకు పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలు అండదండలు అందిస్తున్నాయి. కాబట్టి తీర ప్రాంతంలో ఉగ్రవాద దాడులతో భారత దేశంపై ఒత్తిడి పెంచుతారని భావిస్తున్నారు.