నవ తరం అగ్ని ప్రైమ్ మిసైల్ పరీక్ష విజయవంతం

ABN , First Publish Date - 2021-12-18T18:37:12+05:30 IST

ఒడిశాలోని బాలాసోర్ నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్‌ను శనివారం

నవ తరం అగ్ని ప్రైమ్ మిసైల్ పరీక్ష విజయవంతం

భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ నుంచి అగ్ని ప్రైమ్ మిసైల్‌ను శనివారం విజయవంతంగా పరీక్షించినట్లు భారత ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అగ్ని తరగతి క్షిపణుల్లో ఇది నవతరం క్షిపణి అని తెలిపారు. ఇది 1,000 కిలోమీటర్ల నుంచి 2,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొన్నారు. ఈ క్షిపణి బరువు అగ్ని-3 క్షిపణి బరువులో సగం మాత్రమేనని తెలిపారు.


శనివారం అగ్ని-పీ క్షిపణి ప్రయోగం సందర్భంగా, దీనికి అనేక కొత్త అంశాలను జోడించి పరీక్షించినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇది అణ్వాయుధ సామర్థ్యంగల వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. అణ్వాయుధ సామర్థ్యంగల ఈ వ్యూహాత్మక క్షిపణికి అనేక కొత్త సామర్థ్యాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్ష విజయవంతమైందని, ఈ మిషన్ లక్ష్యాలను అత్యున్నత స్థాయి కచ్చితత్వంతో చేరుకుందని తెలిపారు.


అగ్ని-పీ క్షిపణిని ఈ ఏడాది జూన్ 28న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) మొదటిసారి పరీక్షించింది.  రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీఓను అభినందించారు. ఈ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్షిపణిని రైలు మార్గంలో, రోడ్డు మార్గంలో ప్రయోగించవచ్చు. సుదీర్ఘ కాలం నిల్వ చేయవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాలకు దీనిని రవాణా చేయవచ్చు. ఇది రెండు దశల్లో కనిస్టరైజ్ చేసిన సాలిడ్ ప్రొపెల్లెంట్ బ్యాలిస్టిక్ మిసైల్. క్షిపణిని కనిస్టరైజ్ చేయడం వల్ల దానిని ప్రయోగించడానికి పట్టే సమయం తగ్గుతుంది. స్టోరేజ్, మొబిలిటీ కూడా మెరుగుపడుతుంది. 

Updated Date - 2021-12-18T18:37:12+05:30 IST