భారత్ పద్ధతేం బాలేదు.. ఇండియా పర్యటనకు ముందు ట్రంప్ సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2020-02-20T01:55:54+05:30 IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కా వ్యాపారవేత్తగా మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తూనే, అమెరికాను భారత దేశం బాగా చూడటం లేదని ఆరోపిస్తున్నారు.

భారత్ పద్ధతేం బాలేదు.. ఇండియా పర్యటనకు ముందు ట్రంప్ సంచలన కామెంట్స్

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కా వ్యాపారవేత్తగా మాట్లాడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్తూనే, అమెరికాను భారత దేశం బాగా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు భారత దేశం కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని భద్రంగా ఉంచానని చెప్తున్నారు. 


తన సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఈ నెల 24, 25 తేదీల్లో భారత దేశంలో పర్యటించబోతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో, జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో విలేకర్లతో మాట్లాడారు. 


‘‘భారత దేశం మమ్మల్ని అంత బాగా ఏమీ చూడటం లేదు. కానీ నాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే చాలా ఇష్టం’’ అని ట్రంప్ అన్నారు. 


గుజరాత్‌లోని  సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ‘నమస్తే ట్రంప్’ భారీ కార్యక్రమం గురించి ట్రంప్ ప్రస్తావిస్తూ, ‘‘విమానాశ్రయానికి, ఈ కార్యక్రమం జరిగే ప్రదేశానికి మధ్య 70 లక్షల మంది ఉంటారని ఆయన (మోదీ) నాకు చెప్పారు. ఈ స్టేడియం ప్రస్తుతం నిర్మాణంలో ఉందనుకుంటాను, అయితే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం కాబోతోంది. కాబట్టి ఇదంతా చాలా ఉత్తేజాన్నివ్వబోతోంది. మీరంతా ఆనందిస్తారని ఆశిస్తున్నాను’’ అని ట్రంప్ చెప్పారు. 


తాను భారత దేశం కోసం ఓ గొప్ప వాణిజ్య ఒప్పందాన్ని భద్రపరిచానని చెప్తూ, ఇది (అమెరికా) ఎన్నికలకు ముందు సాధ్యమవుతుందో, లేదో చెప్పలేనన్నారు. అయితే భారత దేశంతో అతి పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. 



Updated Date - 2020-02-20T01:55:54+05:30 IST