10 నుంచి భూ విలువల పెంపు
ABN , First Publish Date - 2020-08-02T10:41:52+05:30 IST
జిల్లావ్యాప్తంగా ఈనెల 10 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 1: జిల్లావ్యాప్తంగా ఈనెల 10 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. ఈ వివరాలను ఇప్పటికే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్లో ఉంచగా, వీటిపై శనివారం నుంచి అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. ఏటా ఆగస్టు ఒకటోతేది నుంచి భూ విలువల పెంపు ప్రక్రియ జరుగుతోంది. ఆ మేరకు చిత్తూరు రిజిస్ట్రేషన్ జిల్లా, తిరుపతి బాలాజీ రిజిస్ర్టేషన్ జిల్లా పరిధిలోని 25 సబ్రిజిస్ర్టార్ కార్యాలయాల అధికారులు దీనికి సంబంధించిన ప్రతిపాదనలు జేసీ మార్కొండేయులుకు సమర్పించారు.
దీనిపై ఆయన గతనెల 31న జిల్లా మార్కెట్ వ్యాల్యూ రివిజన్ కమిటీ సమావేశంలో సమీక్షించి, ఆ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దీంతో శనివారం నుంచి పెంచిన భూ విలువల వివరాలను రిజిస్ర్టేషన్ శాఖ వెబ్సైట్లో ఉంచారు. ఇందులో ఏ ప్రాంతంలో భూముల ధరలు పెంచారు, ఎంతమేర పెరిగాయి, ఆయా సర్వే నెంబర్ల వివరాలున్నాయి. కాగా, రివిజన్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను వారంరోజుల పాటు పరిశీలిస్తామని రిజిస్ర్టేషన్ల శాఖ డీఐజీ పుష్పలత చెప్పారు. ఈనెల 10 నుంచి పెంచిన భూ విలువలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.