ఆ మున్సిపాలిటీలో..కాంగ్రెస్‌ నాలుగు కైవసం

ABN , First Publish Date - 2020-08-04T09:51:58+05:30 IST

తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో కో - ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం సోమవారం రాగన్నగూడలోని ఏబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రత్యేక

ఆ మున్సిపాలిటీలో..కాంగ్రెస్‌ నాలుగు కైవసం

హయత్‌నగర్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలో కో - ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం సోమవారం రాగన్నగూడలోని ఏబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం నిర్వహించగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 17 మంది కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన ఒక కౌన్సిలర్‌ హాజరయ్యారు. టీఆర్‌ఎ్‌సకు చెందిన ఆరుగురు సమావేశానికి గైర్హాజరయ్యారు. 18 మంది కౌన్సిలర్‌లతో పూర్తి స్థాయి కోరం ఉండడంతో అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. నాలుగు కో - ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదించిన పోరెడ్డి నర్సింహారెడ్డి (రాగన్నగూడ), కాకుమాను మరియమ్మ (కమ్మగూడ), నక్క సువర్ణ (మునగనూర్‌), సుజాత్‌ అలీ (తుర్కయంజాల్‌) ఏక్రగీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.


అనంతరం రొక్కం సత్తిరెడ్డి గార్డెన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ మల్‌రెడ్డి అనురాధ రాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ గుండ్లపల్లి హరిత ధన్‌రాజ్‌గౌడ్‌, ఫ్లోర్‌ లీడర్‌ కోశిక ఐలయ్య, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షురాలు మంగమ్మ మాట్లాడారు. మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఎదురులేని శక్తిగా అవతరించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు రొక్కం భీంరెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, నాయకులు గుర్రం చంద్రశేఖర్‌రెడ్డి, జక్క రాంరెడ్డి, ధన్‌రాజ్‌గౌడ్‌, శివకుమార్‌, మాజీ సర్పంచ్‌ జెమ్స్‌తో పాటు కౌన్సిలర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-04T09:51:58+05:30 IST