షోపియన్ ఎన్కౌంటర్లో.. బలగాలు చట్టాన్ని అతిక్రమించాయి
ABN , First Publish Date - 2020-09-19T07:49:31+05:30 IST
కశ్మీర్లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఒక ఎన్కౌంటర్ విషయంలో బలగాలు సైనిక చట్టాల్ని అతిక్రమించినట్లు ప్రాథమికంగా తేలిందని అధికారులు తెలిపారు. ఈ
చట్టప్రకారం చర్యలు: ఆర్మీ
శ్రీనగర్, సెప్టెంబరు 18: కశ్మీర్లోని షోపియన్ జిల్లాలో జరిగిన ఒక ఎన్కౌంటర్ విషయంలో బలగాలు సైనిక చట్టాల్ని అతిక్రమించినట్లు ప్రాథమికంగా తేలిందని అధికారులు తెలిపారు. ఈ విషయమై క్రమశిక్షణ చర్యలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అమ్షీపురా గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేసినట్లు ఈ ఏడాది జూలైలో సైన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో కలకలం చెలరేగడంతో ఆర్మీ విచారణ చేపట్టింది. మృతులు ముగ్గురూ జమ్ములోని రాజౌరీ జిల్లాకు చెందిన వారని, కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. విచారణను కేవలం 4వారాల్లోనే ఆర్మీ పూర్తి చేసింది. ఆర్మీ సాయుధ బలగాలు ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎ్ఫఎ్సపీఏ) ప్రకారం మహాదళపతి నిర్దేశించి, సుప్రీం కోర్టు ఆమోదించిన నియమ నిబంధనలను షోపియన్ ఎన్కౌంటర్లో బలగాలు ఉల్లంఘించినట్లు ఆర్మీ తేల్చింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై ఆర్మీ చట్టం కింద క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే.. ఎంతమందిపై ఈ చర్యలు ఉండనున్నాయనేదానిపై స్పష్టత లేదు. ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం.. మృతుల్ని ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ ఇబ్రార్గా భావిస్తున్నారు. వారి డీఎన్ఏ నివేదిక కోసం చూస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. మృతులు ముగ్గురూ అమ్షీపురాలోని యాపిల్ తోటల్లో కూలిపనులు చేసుకునేవారని తెలుస్తోంది. అయితే.. వారంతా ఇంటి నుంచి ఎందుకు మాయమయ్యారు? సైనిక ఆపరేషన్ మొదలైనప్పుడు కిటికీలోంచి దూకి పారిపోయేందుకు ఎందుకు యత్నించారన్న ప్రశ్నలపై కశ్మీర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.