మహానటుని స్మరణలో...
ABN , First Publish Date - 2022-05-29T05:06:15+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి జిల్లా తెలుగు తమ్ముళ్లు శనివారం కన్నుల పండువగా నిర్వహించారు.
ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
కర్నూలు, మే 28 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలను ఉమ్మడి జిల్లా తెలుగు తమ్ముళ్లు శనివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సినీ వినీలాకాశంలో ధ్రువతారలా వెలిగిన ఎన్టీఆర్ పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సంక్షేమం, అభివృద్ధి, పక్కా ఇళ్లు, వృద్ధాప్య పింఛన్, ప్రాజెక్టులు, రైతులకు కరెంట్, ఇలా ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికారు. ఆ మహానుభావుడు స్థాపించిన టీడీపీ నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. అదే క్రమంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు కూడా రావడంతో తెలుగుదేశం కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని కీలక నేతలంతా ఒంగోలు మహానాడుకు తరలి వెళ్లినా స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి జిల్లాలోని పల్లెపల్లెలో ఉత్సవాలను నిర్వహించారు. దీంతో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా పండగ వాతావరణం నెలకొంది.
మహానాడులో జిల్లా నేతల సందడి
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడుకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వెళ్లారు. శనివారం బహిరంగ సభకు జిల్లా నలమూల నుంచి తెలుగు సైన్యం వెల్లువలా తరలి వెళ్లింది. టీడీపీ నేత చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్లకు అండగా మేం ఉన్నామంటూ కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు సొమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, టీడీజీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డితో సహ వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జిలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, మీనాక్షినాయుడు, తిక్కారెడ్డి, సుజాతమ్మ, టీజీ భరత్, గౌరు చరిత, ఎన్ఎండీ ఫరూక్, భూమా అఖిలప్రియ, బీసీ జనార్దన్రెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖర్రెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, కేఈ శ్యాంబా బు లతో పాటు ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు, గొర్రెల పెంపకం దారుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, అకెపాటి ప్రభాకర్ల ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు మహానాడులో సందడి చేశా రు. పార్టీ సేవా కార్యక్రమాల్లో మేము సైతం అంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు.