నకిలీ విత్తనాల దందాలో..అగ్రి అధికారులపై విచారణ
ABN , First Publish Date - 2020-07-06T11:03:28+05:30 IST
నకిలీ పత్తి విత్తనాల దందాలో వ్యవసాయశాఖాధికారుల పాత్రపై జిల్లా పోలీస్ శాఖ దృష్టి సారించింది.
వివరాలు సేకరించిన పోలీసులు
నల్లగొండ క్రైం, జూలై 5: నకిలీ పత్తి విత్తనాల దందాలో వ్యవసాయశాఖాధికారుల పాత్రపై జిల్లా పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఎస్పీ ఏవీ.రంగనాథ్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ బృందం, నల్లగొండ టూటౌన్ పోలీసులు ఆదివారం నకిలీ పత్తి విత్తనాలు నిల్వ చేసిన వ్యవసాయశాఖ అధికారి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో వ్యవసాయశాఖ అధికారి వ్యవహారంపై పోలీ్సబాస్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ దందాలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అంతర్రాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాను పట్టుకుని 15 క్వింటాళ్ల విత్తనాలను జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా, ఇందులో మరికొందరి పాత్రను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఏదేమైనా నకిలీ విత్తనాలను నివారించాల్సిన వ్యవసాయశాఖ అధికారులే ఈ దందాకు తెరలేపడంతో ఎస్పీ ఈ విషయాన్ని సీరియ్సగా తీసుకున్నారు. నేడో రేపో నకిలీ విత్తనాల దందాలో వ్యవసాయ అధికారుల పాత్ర పూర్తి స్థాయిలో వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.