Har Ghar Tiranga: 10 రోజుల్లో 1 కోటికిపైగా జెండాలను విక్రయించిన ఇండియా పోస్ట్
ABN , First Publish Date - 2022-08-12T22:03:56+05:30 IST
ఇంటింటా జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రజలు పెద్ద ఎత్తున
న్యూఢిల్లీ : ఇంటింటా జాతీయ జెండా ఆవిష్కరణకు ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపుతున్నారు. తపాలా కార్యాలయాల ద్వారా ఇప్పటికే 1 కోటికిపైగా జెండాలను ప్రజలకు అందజేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ (Ministry of Communications) వెల్లడించింది. ఇండియా పోస్ట్ (India Post) ద్వారా జెండాలను ఇంటి వద్దనే అందజేస్తున్నట్లు తెలిపింది.
తపాలా శాఖ (Department of Posts) దేశవ్యాప్తంగా ప్రతి పౌరుని వద్దకు ఇంటింటా జాతీయ జెండా (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమాన్ని తీసుకెళ్ళిందని తెలిపింది. దేశవ్యాప్తంగా తపాలా శాఖకు 1.5 లక్షల కార్యాలయాలు ఉన్నాయని, వీటి ద్వారా 10 రోజుల్లో ఒక కోటికి పైగా జాతీయ జెండాలను ప్రజలకు అందజేసిందని పేర్కొంది. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి కూడా జాతీయ జెండాలను అందజేసినట్లు తెలిపింది.
జాతీయ జెండాలను చౌక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపింది. ఒక్కొక్క త్రివర్ణ పతాకాన్ని రూ.25 చొప్పున అమ్మినట్లు పేర్కొంది. ఆన్లైన్ సేల్స్కు బట్వాడా (డెలివరీ) ఛార్జీలను వసూలు చేయలేదని వివరించింది. దేశంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగానే డెలివరీ చేసినట్లు తెలిపింది. ఈ-పోస్టాఫీస్ సదుపాయం ద్వారా ఆన్లైన్లో 1.75 లక్షల జాతీయ జెండాలను విక్రయించినట్లు పేర్కొంది.
4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు దేశంలోని అన్ని ప్రాంతాలవారికీ అత్యంత ఉత్సాహంగా జాతీయ జెండాలను అందజేస్తున్నారని తెలిపింది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు, పర్వత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలవారికి త్రివర్ణ పతాకాలను చేరవేస్తున్నారని పేర్కొంది.
భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా త్రివర్ణ పతాకం కార్యక్రమాన్ని ఆగస్టు 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రజలు జాతీయ జెండాను తమ ఇళ్లకు తీసుకెళ్లి, స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు.