అంగన్‌వా‘డీలా’!

ABN , First Publish Date - 2021-10-05T05:30:00+05:30 IST

ఇది ఒక్క మెళియాపుట్టి అంగన్‌వాడీ కేంద్రం దుస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా వందలాది అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు లేవు. విద్యుత్‌, తాగునీరు వంటి సౌకర్యాలు లేక చిన్నారులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. ‘నాడు-నేడు’తో అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తామన్న పాలకుల మాటలకు... వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది. కొత్తగా నిర్మించిన భవనాల వద్ద కూడా సరైన సదుపాయాలు లేవు.

అంగన్‌వా‘డీలా’!
మెళియాపుట్టి అంగన్‌వాడీ కేంద్రానికి రిక్షాపై నీటిని తెచ్చిన దృశ్యం




కేంద్రాల్లో మెరుగుపడని వసతులు

నీరు లేక చిన్నారుల దాహం కేకలు

‘నాడు-నేడు’ పనులకు ప్రతిపాదనలతో సరి

 

(మెళియాపుట్టి)

మెళియాపుట్టి అంగన్‌వాడీ కేంద్రం అది. ప్రతిరోజూ రిక్షాపై సుదూర ప్రాంతం నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కొత్త భవనం నిర్మించింది. కానీ విద్యుత్‌ సదుపాయం, బోరు ఏర్పాటు చేయలేదు. దీంతో  అక్కడి సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతం. నిత్యం వ్యయప్రయాసలకు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 - ఇది ఒక్క మెళియాపుట్టి అంగన్‌వాడీ కేంద్రం దుస్థితే కాదు. జిల్లా వ్యాప్తంగా వందలాది అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు లేవు. విద్యుత్‌, తాగునీరు వంటి సౌకర్యాలు లేక చిన్నారులు, సిబ్బంది అసౌకర్యానికి గురవుతున్నారు. ‘నాడు-నేడు’తో అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తామన్న పాలకుల మాటలకు... వాస్తవ పరిస్థితికి పొంతన లేకుండా పోతోంది. కొత్తగా నిర్మించిన భవనాల వద్ద కూడా సరైన సదుపాయాలు లేవు. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 4,192 కేంద్రాలు ఉన్నాయి. 19,686 మంది గర్భిణులు, 17,438 మంది బాలింతలకు పౌష్టికాహారంతో పాటు 1,03,614 మంది చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. చాలావరకూ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కొత్తగా భవనాలు నిర్మించిన చోట వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా విద్యుత్‌ సదుపాయం లేదు. తాగునీటి బోర్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో చిన్నారుల దాహం తీర్చడానికి సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి అందిస్తున్నారు. కొన్నిచోట్ల సొంత ఖర్చులతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగా ‘నాడు-నేడు’ పనులతో అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇందుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఎటువంటి నిధులు విదల్చకపోవడంతో పనులు పట్టాలెక్కడం లేదు.  అనేక గ్రామాల్లో ఇప్పటికీ సొంత భవనాలు లేవు. అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సొంత భవనాల కోసం సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం లేకుండా పోయింది. కొన్ని కేంద్రాలకు నిధులు మంజూరైనా స్థలాలు సమకూరడం లేదు. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భవన నిర్మాణాల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. 

ప్రతిపాదనలు పంపించాం

అంగన్‌వాడీ కేంద్రాల్లో సౌకర్యాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. కొత్త భవనాలు మంజూరైన చోట స్థలాలను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. అంగన్‌వాడీ కేంద్రాలో విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలపై దృష్టి సారించాం. నాడు-నేడు పథకంలో భాగంగా అన్ని రకాల వసతులు మెరుగుపరుస్తాం. 

శాంతిభవాని, సూపర్‌వైజర్‌, మెళియాపుట్టి




Updated Date - 2021-10-05T05:30:00+05:30 IST