ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్యం మెరుగు

ABN , First Publish Date - 2020-12-06T04:59:51+05:30 IST

ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య మెరుగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు.

ప్రజా భాగస్వామ్యంతో పారిశుధ్యం మెరుగు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

  

విజయనగరం   (ఆంధ్రజ్యోతి) డిసెంబరు 5 : ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్య మెరుగు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ పిలుపునిచ్చారు. పారిశుధ్య పక్షోత్సవాల్లో భాగంగా ఈ నెల 7 నుంచి 21 వరకు ‘వ్యర్థాలపై యుద్ధం’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో  సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా  ‘మనం - మన పరిశుభ్రత’పై చర్చించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 330 గ్రామాల్లో నిర్వహించనున్న పారిశుధ్య  పక్షోత్సవాల్లో ప్రజలు, అధికారులు, సిబ్బంది అందరూ పాల్గొవాలని కలెక్టర్‌ ఆదేశించారు. సంపూర్ణ పారిశుధ్య పల్లెలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత, మొక్కల పెంపకం,  తాగునీరు, వ్యర్థాల నిర్వహణ,  తడి, పొడి చెత్త తదితర అంశాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపారు. గ్రామాల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, పాలిథిన్‌ వ్యర్థాలు తొలగించడం, కాలువల్లో పూడిక తీయించడం వంటివి చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కోరారు. మండల, గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలతో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. 7న కోట జంక్షన్‌ నుంచి అయ్యకోనేరు వరకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, మునిసిపల్‌ సిబ్బంది, వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి   పోస్టర్లను విడుదల చేశారు.  జేసీ మహేష్‌కుమార్‌, ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, డీపీవో సునీల్‌రాజ్‌కుమార్‌, జడ్పీ సీఈవో టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


 

   


 

Updated Date - 2020-12-06T04:59:51+05:30 IST