ప్రాధాన్య పదవులు అగ్రవర్ణాలకేనా?
ABN , First Publish Date - 2020-12-06T05:03:40+05:30 IST
బీసీ వర్గాల ఓటర్లుగానే గుర్తించి, ప్రాధాన్య పదవులన్నీ అగ్రవర్ణాలకే ఇస్తారా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరరావు యాదవ్ ప్రశ్నించారు.
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 5: బీసీ వర్గాల ఓటర్లుగానే గుర్తించి, ప్రాధాన్య పదవులన్నీ అగ్రవర్ణాలకే ఇస్తారా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వై.నాగేశ్వరరావు యాదవ్ ప్రశ్నించారు. శనివారం కర్నూలు నగరంలోని బీసీ సంక్షేమ భవన్లో జరిగిన బీసీల నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ను ఏ కారణం లేకుండానే బదిలీ చేసి, ఆ స్థానంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్రనాథ్ రెడ్డిని నియమించడం ఏమిటని ప్రశ్నించారు. కర్నూలులోని మెడికల్ హాస్పిటల్, కాలేజీలను ఎంతో అభివృద్ధి చేసిన బీసీ వర్గానికి చెందిన చంద్రశేఖర్ను సీఎం జగన్ మోహన్ రెడ్డి తొలగించడం దారుణమని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో ప్రాధాన్యత కలిగిన ఉన్నత పదవుల్లో అగ్రవర్ణాల వారినే నియమిస్తున్నారని అన్నారు. బీసీల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్ వాస్తవంగా బీసీలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అన్నారు. కర్నూలు వైద్యకళాశాల ప్రిన్సిపాల్గా డా.చంద్రశేఖర్ను తిరిగి నియమించకపోతే బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, అలాగే తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి పార్వతమ్మ, జిల్లా నాయకులు రాంబాబు, మురళీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.